కాంగ్రెస్,బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి- మంత్రి

184
- Advertisement -

మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవికి మద్దతుగా మల్లాపూర్‌లో ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఇతర టీఆర్‌స్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాణి దేవి మనం గెలిపించుకోవాలి. ఒక్క సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి వాని దేవి.ఆమె విద్యావేత్త,మంచి పేరు ఉన్న కుటుంబం నుండి వచ్చింది. ఉప్పల్‌లో 30 వేల ఓట్లు ఉన్నాయి,మనకు ఉప్పల్ కీలకం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక మహిళ అభ్యర్థి వాణి దేవి అని మంత్రి తెలిపారు.

వాణి దేవిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు గుబులు పుట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు.. మీకు ఎందుకు ఓటు వెయ్యాలి.. ఆనాడు కరెంట్ లేక ఇక్కడ పరిశ్రమల ముందు టెంట్లు వేసుకొని ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూశాం. కానీ ఇప్పుడు కార్మికులు ఓటీ చేసుకుంటున్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి,రోజు పెట్రోల్ రేటు పెంచుతూ వస్తుంది. పెట్రోల్ పోసుకునే ముందు ఆలోచన చేయరా.. ఎందుకు బీజేపీకి ఓటు వేయాలి. మనకు రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ పెడుతాం అని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయలా.. 7 గ్రామాలు ఆంధ్రలో కలిపినందుకు ఓటు వేయలా అని మంత్రి ప్రశ్నించారు.

మొన్న బడ్జెట్ పెట్టిన నిర్మల సీతారామన్ ఎన్నికలు ఉన్న తమిళనాడు, కేరళ, బంగ్లాలో ఎన్నికలు ఉంటే బడ్జెట్‌లో కేటాయింపులు కూడా అక్కడే ఎక్కువ కేటాయించారు. మనకు బడ్జెట్‌లో మొండి చేయి చూపించారు. ప్రతి ఓటర్‌ను మనం కలువాలి,అందరిని కలుపుకొని ఓటు వేయించాలి. 100 మందికి ఒక్క బాద్యుడు ఉండేలా నియమించాలి. భారతదేశంలో ఇంటింటికి నల్ల పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ.ఇంటింటికి నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ,కల్యాణ లక్ష్మీ దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రం నిలిచింది.

బీజేపీ,కాంగ్రెస్ లకు ఢిల్లీలో హై కమాండ్ ఉంటుంది మనకు గల్లీలో ఉంటుంది. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆరెస్ పార్టీ. రెండు ఎమ్మెల్సీ లు మనం గెలుస్తున్నమ్. మొదటి ప్రాధాన్యతతో గెలవాలి.వాణి అక్కకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న అని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ కోసం పదవులు వదుకోలేదు పారిపోయారు. కానీ టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసి సాధించాం. ఎన్నికలు ముగిసిన వెంటనే జాబ్‌ నోటిఫికేషన్ లు వస్తాయి. స్ట్రీట్ మీటింగ్,హాల్ మీటింగ్ లు ఉండవు డైరెక్ట్ ఓటర్ మీటింగ్ లు మాత్రమే ఉండాలి. వాణి అక్కను గెలిపిస్తే పివి నర్సింహ రావుకు సముచిత గౌరవం ఇద్దాం. పివికి కనీస గౌరవం ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ,ఆయనకు కనీసం సమాధి కూడా కట్టలేదు. సీఎం కేసీఆర్ పివికి సముచితమైన గౌరవం ఇవ్వడం కోసం నెక్లెస్ రోడ్‌లో పివి ఘాట్ నిర్మించారని మంత్రి హరీష్‌ రావు గుర్తు చేశారు.

- Advertisement -