కేంద్ర బీజేపీపై మంత్రి హరీశ్‌ ఆగ్రహం..

34
harish
- Advertisement -

సోమవారం గజ్వేల్ రైల్వే స్టేషన్‌లో ఎరువుల ర్యాక్‌ పాయింట్‌ను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, యాదవ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. తొలి విడ‌త‌లో ఏపీలోని కాకినాడ ఎన్ఎఫ్‌సీఎల్ నుంచి 21 బోగీల్లో 1300 మెట్రిక్ ట‌న్నుల ఎరువులు గ‌జ్వేల్ ష్టేష‌న్‌కు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాకు ర్యాక్ పాయింట్ కోసం దశాబ్దాల పోరాటం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్ అడిగాం. రైల్వే లైన్ కేంద్రం బాధ్యత.. కానీ, నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లు నిధులు ఇచ్చేవారు కాదు. రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు నిధులు వాటిని ఎప్పటికప్పుడు ఇచ్చామన్నారు.

కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశామన్నారు. ఈ ర్యాక్ పాయింట్ రావడం జిల్లా ప్రజలకు వరం. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, యాడికెళి ఇస్తావ్ అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నాడు. ఈ రోజు అది నిజం అయిందని మంత్రి తెలిపారు. నీటి తీరువ రద్దని, పన్నులు రద్దు చేసిన ఘనత కేసీఆర్ ది. రైతులకు నీళ్లు ఇచ్చినం, గౌడన్లు కట్టినం, చెరువులు బాగు చేసినం, ఎరువులు ఇస్తున్నామని మంత్రి అన్నారు.

ఇకరేపటి నుంచి రైతులకు రైతుబంధు కింద 7500 కోట్లు ఖాతాల్లో పడుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు. బాయిల కడా మీటర్లు పెట్టనందుకు రాష్ట్రానికి 25 వేళా కోట్లు రాకుండా పోయాయి.. అయినా రైతుల క్షేమమే ముఖ్యమని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మనము బాగవుతుంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నిధులు ఆపుతున్నారు. గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటున్నది. మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారు అని మంత్రి హరీశ్‌ మండిపడ్డారు.

తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలు ఏం చెబుతారు.. నీతి ఆయోగ్ 24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వలేదని చెబుతారా ?.. వరంగల్‌కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకు పోయి తెలంగాణకు అన్యాయం చేశామని చెబుతారా ? మా ఐటీఐఆర్ రద్దు చేశామని చెబుతారా ? అని మంత్రి ప్రశ్నించారు. వరి కొనుమని అంటే నూకలు తినమని చెప్పి అవమాన పరిచిన ప్రభుత్వం బీజేపీ ది అని విమర్శించారు. మీరు హైదరాబాద్‌కు వచ్చే లోపు వరి ధాన్యం ఎంత కొంటావో చెప్పి రావాలి అన్నారు. కేంద్రం కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోకుండా అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్ దుయ్యబ్టారు.

- Advertisement -