ప్రజలను మోసం చేసే పార్టీ బీజేపీ- మంత్రి హరీశ్‌

94
minister harish
- Advertisement -

బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్‌లో తిరుగుతున్నారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు ముఖ్య అథితిగా హాజరైయ్యారు. ఈ మేరకు తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌తో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది. సీఎం కేసీఆర్ కూడా మాదాసు శ్రీనివాస్‌కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2001 నుంచి ఇప్పటి వరకూ అటు ఉద్యమంలో ఇటు పార్టీలో కష్టపడి పని చేసే వ్యక్తి శ్రీనివాస్ అని మంత్రి అన్నారు. బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్‌లో తిరుగుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపింది, కానీ సీఎం కేసీఆర్ బాయికాడ మీటర్లను పెట్టేది లేదని, రైతులకు కష్టం తెచ్చేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారని మంత్రి హరీశ్ వెల్లడించారు. ఎఫ్‌సీఐతో బియ్యం కొనకుండా రైసు మిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్‌ఆర్‌బీఎం నిధులను కావాలనే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపివేసింది. కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయకుండా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుందని కేంద్రాన్ని మంత్రి హరీశ్ హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ ఆపేసింది. వరంగల్ రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు తీసుకెళ్లిందని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో.. కేంద్ర బీజేపీ చెప్పాలని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్నీ నింపుతామని చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రారంభించారని మంత్రి వెల్లడించారు. వందలాది దరఖాస్తులు పెట్టుకున్నా.. మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రానికి మంజూరు కాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతున్నదని మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -