ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే- మంత్రి హరీష్

161
- Advertisement -

ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం శ్రీ కేసిఆర్ దే అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి వారికి మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు రఘునందన్ రావులు స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసిఆర్ దేనని అన్నారు.దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.సమైక్య రాష్ట్రంలో పాలకులు దేవాలయానికి సంబంధించిన నిధులను ప్రభుత్వాలు, ప్రజా అవసరాలకు వాడుకునేవారని అన్నారు.స్వరాష్ట్రంలో ప్రభుత్వమే దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం, జీర్ణ దేవాలయాల అభివృద్ధికి ఖర్చు చేస్తుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాతే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలకు సైతం దేవుళ్ళ పేర్లను పెట్టారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. దేవుడి ఆశీస్సులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ధృఢ సంకల్పంతటనే 2020-21 సంవత్సరంలో దేశంలోనే తెలంగాణ అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా రికార్డ్ సృష్టించిందన్నారు. తద్వారా దేశానికే ధాన్యపు భాండాగారంగా నిలిచిందని అన్నారు. దేవుడి ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాలలో ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. తలసరి ఆదాయంలో దేశంలో టాప్ రెండు,మూడో స్థానంలో నిలిచిందన్నారు. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెం.1 గా నిలబడిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో తలసరి ఆదాయంలో చివరి స్థానంలో ఉన్న మనం ఒక్కో సంవత్సరం ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు, సిఎం దీర్ఘ దృష్టితో GSDP,తలసరి ఆదాయంలో ముందు నిలిచామన్నారు. దేశానికే దిక్సూచి, ఆదర్శంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం అన్నారు.

2009లో దుబ్బాకలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టిన నాడు దుబ్బాక ప్రాంతం కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కనిపిస్తోందని మంత్రి తన్నీరు హరీష్ ‌రావు పేర్కొన్నారు. గోదావరి జలాలలో దుబ్బాక అభివృద్ధి చెందుతుందని అన్నారు. దుబ్బాకలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అద్భుతంగా వచ్చిందని అన్నారు.దేవాలయం నిర్మాణంకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా రూ.4 కోట్ల 25 లక్షలు, వ్యక్తిగతంగా రూ. కోటి రూపాయలు అందజేశారనీ మంత్రి తెలిపారు.

- Advertisement -