కొవిషీల్డ్ డోసుల వ్యవధి తగ్గించండి.. కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్‌..

238
harish
- Advertisement -

కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండో డోస్కు 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యవధి ఎక్కువగా ఉండటంతో రెండో డోస్ వేయడం కష్టంగా మారిందన్నారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది ఎక్కువగా ఉన్నదన్నారు. మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు చెప్పారు. రెండో డోస్కు 12 వారాల గడువు ఉండటంతో కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తున్నదని అన్నారు. ఈ కారణాల దృష్ట్యా రెండో డోస్ వ్యవధిని గతంలో మాదిరిగా 4-6 వారాలకు తగ్గించాలని సూచించారు. గడువును కుదిస్తే రెండో డోస్ వేసుకునేవారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు.

తెలంగాణలో 2.77 కోట్ల మంది కొవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.77 కోట్ల డోసులను వేసినట్టు వెల్లడించారు. ఇందులో 2.49 కోట్లు మొదటి డోస్ అని, 1.28 కోట్లు రెండో డోస్గా పేర్కొన్నారు. అర్హులందరికీ టీకా రెండు డోసులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని చెప్పారు. హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్లు, హైరిస్క్ గ్రూప్ వారికి రెండో డోస్ వేసి 8-10 నెలలు దాటిందని లేఖలో మంత్రి హరీష్‌ రావు గుర్తుచేశారు. వ్యాక్సిన్ తీసుకొని ఎక్కువ కాలం అవుతుండటం, కొత్త వేరియంట్లు వస్తుండటాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి బూస్టర్ డోస్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

- Advertisement -