గత ప్రభుత్వాలు రైతును నిర్లక్ష్యం చేశాయి- మంత్రి హరీష్‌

130
harish rao
- Advertisement -

రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌ రావు శనివారం మెదక్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని చిన్న శంకరం పేటలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లాలో రూ.94 కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామని చెప్పారు. యాసంగిపంట సాయం కోసం జిల్లాకు రూ.190 కోట్లు ఇచ్చామన్నారు మంత్రి.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట సాయంగా రూ.7,200 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. అతిత్వరలో కాళేశ్వరం ద్వారా మెదక్‌ జిల్లాకు నీరందిస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే ఆర్థికసంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని మంత్రి హరీష్‌ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

- Advertisement -