వడ్లు కొనకుండా కేంద్రం కుట్రలు- మంత్రి హరీశ్‌

47
harish rao
- Advertisement -

తెలంగాణలో అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యాన్ని ఈరోజు ఆయన స్వయంగా అన్ని మార్కెట్లకు వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం ఆరబెట్టే విధంగా చర్యలు తీసుకున్నం. సిద్దిపేటలో పండిన పంట అంతా కొనే విధంగా 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామన్నారు. 421 సెంటర్లు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల సెంటర్లలో కొనుగోలు ప్రారంభమయిందన్నారు. 4 వేల టార్పాలిన్ కవర్లు ఒక్క సిద్దిపేటలో కొనుగోలు చేయడం జరిగింది. ఎక్కడా ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించాం.రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే, ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుంది. అలా ఆరబెట్టకుండా మార్కెట్ యార్డుకు, ఐకేపీ సెంటర్లకు తెస్తే వర్షానికి తడిసిపోతున్నాయి. లోతట్టు ప్రాంతంలో ఆరబొస్తే అకాల వర్షం వల్ల ధాన్యం తడుస్తోందని మంత్రి తెలిపారు.

దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది. కాని తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుంది. రా రైస్ కొంటం, బాయిల్డ్ రైస్ కొనం అన్నరు. వేసవిలో తెలంగాణలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల భారం వహించి రైతులను కాపాడాలని, రైతులకు మద్ధతు ధర కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నరు. కాని కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2900 రైస్ మిల్లులపై దాడులు చేయిస్తోంది. ఒక నెల ఆగి దాడులు చేస్తే ఎమవుద్ది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వడ్లు కొనవద్దు అన్న కారణంతో ఎఫ్‌సీఐ.అధికారులతో దాడులు చేయిస్తోంది అని మండిపడ్డారు. మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుద్ది. మీ ఉద్దేశం ఏంటి.. వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు. కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నం. రైతు సోదరులు దీన్ని గమనించాలి. 2990 మీద రైడ్ చేస్తరా.. ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది అని ధ్వజమెత్తారు.

వడ్లు కొనమని తొండాట ఆడారు. కొనకపోతే తెలంగాణకు చెడ్డ పేరు రావాలని చూశారు. కేసీఆర్ 3 వేల కోట్లతో కొనాలని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రైతులు మిల్లర్ల వద్ద ధాన్యం దింపకుండా ఉండేలా చేస్తోంది. తడిస్తే రైతులు ఇబ్బంది పడేలా, తెలంగాణ ప్రభుత్వంపై కోపం వచ్చేలా కుట్రలు చేస్తోంది కేంద్రం. తెలంగాణ రైతాంగం బీజేపీ కుట్రలు గమనించాలి. నల్ల చట్టాలు తేలేదు కాని, నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. బాయిలకాడ మీటర్లు పెట్టాలంటున్నారు. డిజీల్ ధరలు పెంచారు. ట్రాక్టర్ తో దున్నడానికి ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది. వరి కోత మిషన్ తో పని ఇవాల రెండు వేలు దాటింది. ఎరువుల ధరలు పెంచారు.రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా.. తనిఖీల పేరుతో మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయకుండా చేస్తున్నరు. మిల్లుల ముందు లారీలతో ధాన్యం వచ్చాక ఎఫ్.సీ.ఐ అధికారులు మిల్లులో కూర్చోని ఇబ్బంది పెడుతున్నరు. దీన్ని విరమించుకోవాలి.రైతులను ఇబ్బందిపెట్టడం కేంద్రానికి తగదు అని మంత్రి హరీశ్‌ విమర్శించారు.

- Advertisement -