గాంధీ తరహాలో ఎంజీఎం అభివృద్ధి: మంత్రి ఈటల

261
etela rajender
- Advertisement -

కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ లోని గాంధి తరహాలో వరంగల్ ఎంజిఎంను తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజిఎం సందర్భించిన అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల ప్రకటించారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు,పిపిఇ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు ఈటల ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి, వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ పై ఎక్కువ దృష్టి పెట్టాం. ఎంజిఎంలో ప్రత్యేక వార్డు పెట్టాం. కెఎంసిలో మరో వార్డు సిద్ధం చేస్తున్నాం. ఎంత మంది రోగులొచ్చినా హైదరాబాద్ కానీ, ప్రైవేటు ఆసుపత్రులకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశాం. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. మిగతా వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నారు.

మరణాల సంఖ్య ఒకశాతం లోపే ఉంది. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలు మందు. వైరస్ సోకిన వారు ఆసుపత్రిలో ఉన్నా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా వైద్యులు ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అవరసమైన మందులు, సూచనలు అందిస్తున్నరు. వైరస్ సోకిన ప్రతీ ఒక్కరికీ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నాం. బంధువులు ముందుకు రాకపోతే ప్రభుత్వ పరంగానే ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే, వారి బంధువులు రాకుంటే ప్రభుత్వ పరంగానే అంత్యక్రియలు కూడా చేస్తున్నాం అని ఈటల వెల్లడించారు.

కరోనా విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్, అంటు వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలి. వానలు, వరదలు వచ్చినందున జ్వరాలు, ఇతర రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్య పనులు నిర్వహించాలి. పరిశుభ్ర వాతావరణం వల్ల చాలా వరకు అంటు రోగాలను, సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. కరోనా పేషంట్లకు తోడుగా వారి అటెండెంట్లను వార్డుల్లోకి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించవద్దు. సారి, కరోనా పేషంట్లను కలిపి ఉంచవద్దు. వైద్య సిబ్బందికి అవసరమైనన్ని పిపిఇ కిట్లు ఉన్నాయి. వాటిని ఉపయోగించాలి. వైద్యుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం.ఆసుపత్రుల్లో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ/విసర్జన మరింత మెరుగ్గా జరగాలి అని ఈటల సూచించారు.

- Advertisement -