తొలి కరోనా డెలివరీ విజయవంతం…

202
etela
- Advertisement -

తెలంగాణలో ఇప్పటివరకు 1132 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపిన ఈటల ఇప్పటివరకు 727 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. 29 మంది ఇప్పటివరకు మరణించగా ప్రస్తుతం 376 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

రాష్ట్రం లో 33 జిల్లాల్లో 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాల్లో కరోనా కేసులు లేవు కాబట్టి వాటిని కూడా గ్రీన్ జిల్లాలుగా ప్రకటించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సూర్యాపేట,వరంగల్ అర్బన్,నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్ జోన్ లో చేర్చాలని కోరామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలో మాత్రమే రెడ్ జోన్స్ ఉన్నాయి. వీటిల్లో కూడా హైదరాబాద్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదుఅవుతున్నాయి అని మంత్రి అన్నారు.

మరో 14 జిల్లాలో కేసులు లేవు కాబట్టి వాటిని కూడా గ్రీన్ జిల్లాలుగా ప్రకటించాలని , అలాగే సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా కేసులు లేవు కాబట్టి ఆరంజ్ జిల్లాలుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి . వీటిల్లో కూడా రూరల్ ప్రాంతంలో కేసులు లేవు అని మంత్రి అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టాయి అని అందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నామని ఇదే విషయం ఈ రోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో జరిగిన వీడియొ కాన్ఫరెన్స్ లోకూడా చర్చించామని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి అన్నారు.

పరీక్షలు ఎవరికి పడితే వారికి చేయవద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మార్గానిర్దేశకాలు ఇచ్చింది అని పాజిటివ్ కేసులతో కలిసిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్ట్ చేయాలని,లక్షణాలు లేనివారిని 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచాలని..అదే వయసు మళ్లిన వారు,ఇతర జబ్బులతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీ లకి పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వారి కాంటాక్ట్ పర్సన్స్ ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఎక్కువ పరీక్షలు చేశాము ఇప్పుడు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువమందికి పరీక్షలు చేస్తున్నామని మంత్రి వివరించారు. దీనిపై పసలేని వాదనలు చేయవద్దని కోరారు.

ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో కాలాపత్తర్ కి చెందిన 27 ఏళ్ల గర్భవతి కి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. 3 కేజీల బాబు పుట్టారు. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వారిలో అనేక ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న 75 సంవత్సరాల వ్యక్తి , డయాలసిస్ చేయించుకుంటూ చావు బ్రతుకుల్లో ఉన్న మరో కరోనా పాజిటివ్ పేషంట్ కి సైతం చికిత్స చేసి ఇంటికి పంపించామని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు. గాంధీ వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఎక్కువ సజీవ సాక్ష్యం ఏమకావాలి అన్నారు .

కరోన కేసులు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వవద్దని ముఖ్యమంతి కె చంద్రశేఖర్ రావు గారు కోరారని, కంటైన్మెంట్ జోన్స్ లో మరింత కఠిన చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేయాలని సూచించారని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటలపాటు టెలీ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ముప్పై సర్కిల్ లు ఉంటే ఎనిమిది సర్కిల్ లో రెడ్ జోన్ లో ఉన్నాయని అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలుచేస్తున్నామని మంత్రి అన్నారు.

ఇతర దేశాలు, జిల్లాల నుండి వచ్చేవారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. ఎయిర్పోర్టు లోనే స్క్రీనింగ్ చేస్తామన్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తామని తెలిపారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని బోర్డర్స్ లోనే చెక్ చేస్తున్నామని అన్నారు. కోవిడ్ మరణాల కంటే ఆకలితో, నడిచి వెళ్ళేవారు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు కనుక తొందరగా సాధారణ స్థితి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి సేవలు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఓపి చూసుకోవాలని కోరినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -