దళారులు లేకుండా రైతులకు గిట్టుబాటు ధరలు: ఎర్రబెల్లి

158
errabelli
- Advertisement -

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లింగాల ఘనపూర్ మండలం పటేల్ గూడెం క్రాస్ రోడ్ లో గల ఓం శాంతి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా పాలకుర్తి మండలానికి చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే నేల పోగుల క్రాస్ రోడ్ లో గల వెంకట సాయి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా కొడకొండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని, చిల్పూరు మండలం రాజవరం లో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సీఎం కేసిఆర్ రైతుల పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న దే సీఎం లక్ష్యం అన్నారు. దళారులు లేకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలని, రైతులు రాజులు కావాలని కెసిఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. సాగు నీరు,రైతు బంధు, రైతు బీమా, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, ఇవ్వటమే కాకుండా, రాష్ట్రంలో లక్ష కల్లాలు, రైతు వేదికలు, నిర్మిస్తున్నారని మంత్రి వివరించారు. ఇవన్నీ రైతాంగానికి తెలిపే బాధ్యతని ప్రజా ప్రతినిధులు తీసుకోవాలన్నారు. అధికారులు కూడా ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సీసీ ఐ ద్వారా పత్తి కొనుగోలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలను కొనుగోలు చేస్తామని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు తమ పంటలను నిర్ణీత నిబంధనల ప్రకారం తాలు, తేమ లేకుండా మార్కెట్ల కు తీసుకురావాలన్నారు. రైతులను మోసం చేస్తే, దళారుల పని పడతామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కరోనా విజృంభించే అవకాశాలు కనిపి స్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రైతులు కూడా మార్కెట్లలో నిబంధనల ప్రకారం కోవిడ్ నివారణ కు వీలుగా, మసలుకోవాలి మంత్రి పిలుపునిచ్చారు. మిల్లర్లు కూడా ముందుగా రైతుల ధాన్యాలు, పత్తి ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -