మ‌హిళ‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది- ఎర్రబెల్లి

130
minister errabelli
- Advertisement -

స్వయం సంఘాల సభ్యులకు జీవనోపాధుల ఏర్పాటులో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు, పెద్ద వంగర మండలాల 1500 మంది మహిళలకు, రు.32కోట్ల విలువైన స్త్రీ నిధి కింద, పాడి పశువులు, ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిపై పూల వర్షం కురిపించారు. ముందు బతుకమ్మ లతో స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పులతో మంత్రికి మహిళలు స్వాగతం పలికారు. మహిళలు మంత్రి పట్ల తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. పాడి పశువులు, పెరటి కోళ్లు, ఈ ఆటోలను పరిశీలించి లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. అలాగే, మహిళ సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ఉత్పత్తుల స్టాల్ ను సందర్శించారు. వారి ఉత్పత్తులను చూసి అభినందించారు.

అనంతరం మహిళలతో భారీ ఎత్తున జరిగిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుడారు. ఈ రోజు స్త్రీ నిధి ప‌థ‌కం కింద ఉపాధి కోసం రుణాలు పొందిన మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు! మీరు పొందిన ఈ రుణాలు మీ అభివృద్ధికి తోడు కావాల‌ని కోరుకుంటున్న‌. మ‌హిళ‌లు మంచి పొదుప‌రులు. మ‌హిళ‌లు అత్యంత శ‌క్తిమంతులు. వారి బ‌లాన్ని వారు గుర్తించ‌రు. క‌నీ, గుర్తించిన వాళ్ళు మ‌గోళ్ల కంటే కూడా గొప్ప‌గా ఎదుగుత‌రు. మ‌హిళ‌ల‌ను ఆదిపరాశ‌క్తిగా పూజిస్తం. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాలు కూడా మ‌హిళ‌ల‌ను అత్యంత‌గా గౌర‌వించేవి. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఏ కుటుంబంలోనైనా ఆ ఇంటి మ‌హిళ బాగుంటేనే… ఆ ఇల్లు, కుటుంబం బాగుప‌డ‌త‌ది. మ‌హిళా శ‌క్తిని గుర్తించి, వారి అభివృద్ధికి స్త్రీ నిధి సంస్థ‌ను ఏర్పాటు చేసిన ఘ‌న‌త మ‌న రాష్ట్రానిదే. 2020-21 ఏడాదిలో రాష్ట్ర ప్ర‌భుత్వం స్త్రీ నిధి కింద 2 వేల 400 కోట్లు రుణాలను అందిస్తున్నది. ఇప్పటి వరకు 1 వెయ్యి 140 కోట్ల రూపాయ‌ల‌ను రాష్ట్రంలోని 2ల‌క్ష‌ల 74 వేల‌ సభ్యులకు ఇచ్చాం. మిగతా మొత్తాన్ని 31 మార్చి, 2021 లోగా ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించామని మంత్రి తెలిపారు.ఈ రోజు మన మహబూబాబాద్ జిల్లాలో 1 వేల 500 మంది సభ్యులకు స్త్రీ నిధి నుండి ర‌క‌ర‌కాల ఉపాధి కోసం 19కోట్ల 90 ల‌క్ష‌ల రుణాలు ఇస్తున్నం. ఇందులో 14 కోట్ల 2 ల‌క్ష‌లు పాడి పశువుల కొనుగోలు కోసం 75 లక్షలు 25 ఎలక్ట్రిక్ ఆటోల కోసం ఇతర ఉపాధుల కోసం 27 కోట్ల ఇవ్వడం జరిగినది. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

దేశంలో ఎక్క‌డా ఇలాంటి స్త్రీల అభివృద్ధి కోసం ఇలాంటి సంస్థ‌లు లేవు. మ‌న‌ స్త్రీ నిధి సంస్థ‌ను ఆద‌ర్శంగా తీసుకుని, మిగ‌తా రాష్ట్రాలు త‌మ రాష్ట్రాల్లో అమ‌లు చేయాల‌ని కోరుతున్నాయి. ప్ర‌భుత్వం మ‌హిళా స‌మాఖ్య‌ల ద్వారా రాష్ట్రంలోని మ‌హిళా సంఘాల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు ఇస్తున్న‌ది. సంఘంలోని ఒక్కో మ‌హిళకు 5వేల నుండి 3ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు అందిస్తున్నం. మీ ఊళ్ళోనే మీకు న‌చ్చిన ప్రాజెక్టును పెట్ట‌కుకోవ‌చ్చు. బ్యాంకుల వ‌డ్డీ కంటే త‌క్కువ కేవ‌లం 11.5శాతం వ‌డ్డీ మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నం. వ‌సూలు చేసే వ‌డ్డీలో 10శాతం మ‌ళ్ళా మ‌హిళా సంఘాల‌కే ఇస్తున్నం. మ‌హిళా సమాఖ్య‌ల‌కు ఇచ్చే వ‌డ్డీ కూడా బ్యాంకుల వ‌డ్డీ కంటే 3శాతం వ‌ర‌కు ఎక్కువ‌. ఒక వేళ రుణం తీసుకున్న మ‌హిళ చ‌నిపోతే, ఆత‌ర్వాత రుణం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. పైగా, చ‌నిపోయిన మ‌హిళ బ‌తికున్నంత వ‌ర‌కు చెల్లించిన డ‌బ్బు మొత్తాన్ని ఆమె వారసులకు స్త్రీనిధి సురక్ష పథకం ద్వారా తిరిగి అందిస్తున్నం. చనిపోయిన సభ్యురాలి అంత్యక్రియల కొరకు, అదే రోజు 5వేలు ఆమె కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఇంకా ఎక్కువ రుణాలు మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ది. ఎక్కువ పాల దిగుబడి కోసం మంచి పాలిచ్చే పాడి పశువులను కొన‌డానికి 60 వేల రుణాన్ని 75 వేల‌కు పెంచాం. వ‌చ్చే రెండేండ్ల‌లో లక్ష పాడి పశువులకు రుణాలు ఇవ్వటానికి నిర్ణయించినం. 50 నుండి 100 పెరటి కోళ్ళ పెంపకం కోసం ఒక్కో సభ్యురాలికి 12వేల 500 నుంచి 22వేల వరకు ఋణం ఇస్తున్నం. రాష్ట్రంలో 5వేల కోళ్ళ పెంప‌కం యూనిట్లు, మహబూబాబాద్ జిల్లాలో 200 యూనిట్లు ఇస్తున్నం. పెరటి కోళ్ళ ఉత్ప‌త్తి కేంద్రాన్ని పెట్ట‌డానికి 3 లక్షల వరకు ఋణం పొందవచ్చు. ఇలాంటి 8 యూనిట్లను మహబూబాబాద్ జిల్లాలో ఇస్తారు. కాలుష్యం లేకుండా.. త‌క్కువ ఖ‌ర్చుతో న‌డిచే, ఒక్కో ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు 3 లక్షల వరకు ఋణం పొందవచ్చు. ఈ ఏడాది వెయ్యి ఆటోలకు రుణాలు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో 25 ఆటోలకు రుణాలు ఇస్తాం.అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

రోడ్ల మీద చిన్న చిన్న దుకాణాలు పెట్ట‌కునే వారిని ఆదుకోవ‌డానికి 10 వేల వ‌ర‌కు రుణాలిస్తున్నం.ఇప్పటి వరకు రాష్ట్రంలో 22 వేల 600 మంది వీధి వర్తకులకు రుణాలు అందించినం. మారుమూల గ్రామాలకు బ్యాంకు సేవ‌లు విస్త‌రించ‌డానికి 11 వంద‌ల గ్రామాల్లో స్టేట్ బ్యాంకు, యూనియ‌న్ బ్యాంకుల సేవా కేంద్రాలు మ‌హిళ‌లే నిర్వ‌హించేలా చేశాం. ఉపాధి హామీ కూలీల‌కు వేత‌నాలు కూడా ఇలాంటి సేవా కేంద్రాలే ఇస్తున్న‌యి. ఒక్కో సేవా కేంద్రం ద్వారా నెలకు ఒక్కో సభ్యురాలు సగటున 13 వేల‌ ఆదాయం పొందుతున్న‌రు. అని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్త మ‌హిళ‌లంద‌రికీ ఈ సంద‌ర్భంగా ఓ శుభ వార్త‌!
స్త్రీ నిధి సురక్ష- బి అనే పథకం అమలుకు నిర్ణయించినాం. అర్హ‌త గ‌ల ప్రతి సభ్యురాలు మూడు ఏండ్లకు ఒక్కే ఒక్క‌సారి 690 రూపాయ‌ల‌ను ప్రీమియంగా చెల్లించాలి. ఈ నిధిని మొత్తాన్ని తిరిగి సుల‌భ వాయిదాల్లో చెల్లించే విధంగా మ‌హిళ‌ల‌కే రుణంగా అందిస్తారు. ఈ పథకంలో చేరిన సభ్యురాలు మరణిస్తే, లక్ష వరకు సభ్యురాలి వారసులకు చెల్లిస్తారు. మ‌హిళ‌లంద‌రికీ నేను చెప్పేది ఒక్క‌టే… మ‌హిళ‌లు అభివృద్ధి చెందితే ఆ కుటుంబంతోపాటు, స‌మాజం, గ్రామం, దేశం కూడా బాగుప‌డుత‌ది. సీఎం కెసిఆర్ మ‌హిళా ప‌క్ష‌పాతి. మ‌హిళ‌ల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. మీకు అండ‌గా ఉంది. మీ, మీ కుటుంబం, మ‌న స‌మాజం, దేశం అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది. న‌యా పైస కూడా వృధా కావ‌ద్దు… స‌ద్వినియోగం చేసుకోండి. స్త్రీ నిధి మంత్రిని కూడా నేనే… కాబ‌ట్టి మ‌రిన్ని నిధులు మీకు ఇప్పిస్త‌. అందిరికీ మ‌రోసారి శుభాకాంక్ష‌లు! అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.

- Advertisement -