అర్హులైన అందరికీ త్వరలో పెన్షన్లు- మంత్రి ఎర్రబెల్లి

130
Minister Errabelli
- Advertisement -

ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున, సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితా వెంటనే తయారుచేసి, పెన్షన్లు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అసరా పెన్షన్లు – వయోపరిమితి తగ్గింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలు అవుతున్న వివిధ పథకాలను మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో అర్హులైన, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెన్షన్లు పొందడానికి కనీస వయస్సును 65 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలకు తగ్గించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు రోజుల లోగా పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను అదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు.

ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలను 100% బతికే విధంగా ప్రత్యేక చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు.గ్రామపంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇతర సాగునీటి వనరులను వినియోగించుకుని వర్షాకాలంలో నాటిన మొక్కల వాటరింగ్ చేయాలని ఆయన కోరారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు పనుల సోషల్ ఆడిట్ మానిటరింగ్ కోసం మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి దయాకర్ రావు అదేశించారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లో పనిచేసే పంపు మెకానిక్ ల సమస్యల పరిష్కరించడానికి చర్య నిమిత్తం తగిన రిపోర్టును తమకు సమర్పించాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కొరకు నివేదిక సమర్పించాలని ఆయన కోరారు అంతేకాకుండా చిన్న చిన్న మర్మ్మతులు వెంటనే చేపట్టి వాహనాలు వెళ్లడానికి అనుకూలంగా రోడ్లను తీర్చిదిద్దాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -