మంత్రి చొరవతో పట్టుబడిన గంజాయి ముఠా..

192
- Advertisement -

జనగామ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్ మీద ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆ వాహనాలపై ప్రయాణం చేస్తున్న యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అదే సమయంలో ఆ దారిలో అటుగా వెళుతూ ఈ ఘటనను చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన కాన్వాయ్ ని ఆపారు. వెంటనే డీసీపీ, పోలీస్ లకు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ లోగా చుట్టుపక్కల ప్రజలు చేరారు. వారి సహాయంతో గాయపడిన వారిని పక్కన కూర్చోపెట్టారు. ఈ లోగా ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీస్ లను చూసిన వెంటనే ఇద్దరు యువకులు అక్కడి నుండి పరార్ అయ్యారు.

అనుమానం వచ్చిన పోలీసులు పట్టుబడిన యువకుడిని విచారించారు. అతడి వద్ద ఉన్న సంచులను చెక్ చేశారు. అందులో గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లారు. గాయపడిన యువకులను జనగామ హాస్పిటల్ కి పంపించారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.కాగా, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి తమకు ఫోన్ చేయడం వల్ల సహాయక చర్యలు అందడమే గాక, గంజాయి పట్టుబడి, సరఫరా చేస్తున్న ముఠా కూడా దొరికిందని, మంత్రికి పోలీసు అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలో గంజాయి పట్టుబడటం ఆశ్చర్యంగా, ఆందోళనగా ఉందన్నారు. అందులోనూ యువకులు పట్టుబడటం చూస్తే, ఇబ్బందిగా ఉందన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడటం మంచిది కాదని, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు మంచి దారిలో పయనించాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, సరఫరాను అరికట్టాలని అదేశించారు. తనతో సహాయక చర్యల్లో పాలు పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -