భారత ఫుట్బాల్ అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తోన్న క్షణం ఎట్టకేలకు రానే వచ్చింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా ‘గోట్’గా గుర్తింపు పొందిన లియోనల్ మెస్సీ కోల్కతాకు చేరుకున్నారు. 2011 తర్వాత మెస్సీ మళ్లీ భారత్కు రావడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
మెస్సీ కోల్కతాలో అడుగుపెట్టిన క్షణం నుంచే నగరం మొత్తం ఆయన నామస్మరణతో మార్మోగుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు అభిమానుల జనం, ప్లకార్డులు, నినాదాలతో కోల్కతా ఫుట్బాల్ జ్వాలల్లో మునిగిపోయింది. ‘మెస్సీ… మెస్సీ…’ అంటూ మార్మోగిన నినాదాలు ఈ పర్యటనకు ఉన్న క్రేజ్ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ పేరుతో సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మెస్సీ అభిమానులతో భేటీ కావడంతో పాటు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత ఫుట్బాల్ అభివృద్ధి, యువతకు ప్రేరణ అందించడమే లక్ష్యంగా ఈ టూర్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Also Read:భారత్పై సుంకాలు అక్రమం..అమెరికా ఎంపీలు!
భారత ఫుట్బాల్ అభిమానులకు మెస్సీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు… ఒక భావోద్వేగం. ఆయనను ప్రత్యక్షంగా చూడబోతున్న ఆనందంతో దేశవ్యాప్తంగా అభిమానులు పండుగ వాతావరణంలో ఉన్నారు. కోల్కతా నుంచే మొదలైన ఈ మెస్సీ జపం, దేశమంతా వ్యాపించనుంది.

