‘అభినేత్రి’ వంటి హారర్ థ్రిల్లర్ చేసిన ప్రభుదేవా తాజాగా ‘మెర్క్యురీ’ సినిమా చేశాడు. ఆ మధ్య ముంబై వెళ్లిన ప్రభుదేవా .. దర్శకుడిగా కొన్ని హిట్ చిత్రాలు చేశాడు. ఆ తరువాత మళ్లీ చెన్నైకి చేరుకొని నటన పట్ల .. నిర్మాణం పట్ల దృష్టి పెట్టాడు. ఇప్పుడు గతంలో ‘పిజ్జా’ సినిమాను రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ ‘మెర్క్యురీ’ కి దర్శకుడిగా వ్యవహరించాడు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఊరికి దూరంగా విసిరివేయబడినట్టుగా ఒక ఇల్లు కనిపిస్తోంది. చిమ్మ చీకట్లో కొంతమంది కుర్రాళ్లు భయంతో దాక్కుంటున్నారు. ఒళ్లంతా రక్తంతో తడిసిన ప్రభుదేవా .. వాళ్లని వెతుక్కుంటూ వస్తున్నాడు. తమ శ్వాస శబ్దం కూడా బయటికి రాకూడదన్నట్టుగా వాళ్లంతా ఊపిరి బిగబడుతుండటం ఈ టీజర్లో కనిపిస్తోంది. ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయనే విషయాన్ని ఈ టీజర్ చూసి చెప్పొచ్చు. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.