మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలి- కలెక్టర్ హరీశ్

133
collector harish
- Advertisement -

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఊరి ఊరికో జమ్మిచెట్టు – గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమంలో గురువారం జిల్లాలోని కీసర తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్ పిలుపు మేరకు మొక్కలను నాటామని దీనివల్ల నాలుగు శాతం అటవీ విస్తీర్ణం వృద్ది చెందిందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలతో పాటు ఊరిలో, గుడి ఆవరణలో జమ్మి చెట్లను నాటాలని కలెక్టర్ హరీశ్ కోరారు.

ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటేలా చూసిందని అలాగే మరింత ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేందుకు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలను నాటాలని తెలిపారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం వల్ల వాతావరణ కాలుష్యం అరికట్టడంతో పాటు ముందు తరాలకు మంచి వాతావరణాన్ని, భవిష్యత్తును అందించిన వారమవుతామని కలెక్టర్ హరీశ్ అన్నారు.

అనంతరం ఊరిఊరికో జమ్మిచెట్టు. గుడిగుడికో జమ్మిచెట్టు పోస్టర్‌ను కలెక్టర్ హరీశ్ తదితరులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి ఆర్డిఓ రవి, కీసర తాసిల్దార్ గౌరీ వత్సల, కీసర ఎంపిపి ఇందిర, అటవీశాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -