యాసంగి ధాన్యం కొనుగోలులో ఆల్ టైం రికార్డ్- మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

150
Mareddy Srinivas Reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కనీస మద్దతు ధరకు రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ. 84వేల కోట్లు విలువ చేసే 4 కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ. పిఎసిఎస్, డిసిఎంఎస్టతో పాటు జి.సి.సి, హాకా వంటి ఇతర ఏజెన్సీలకు రూ. 1,029 కోట్ల కమిషనను చెల్లించామని తెలిపారు.

మంగళవారం పౌరసరఫరాలభవన్‌లో మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఇదివరకు యాసంగిలో కంటే వానాకాలంలో ఎక్కువ పంటలు పండేవి ఇప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. వానాకాలంలో పండిన పంట కంటే కూడా యాసంగిలో అధిక పంటలు పండుతున్నాయి. దీనికి ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి.. కొనుగోళ్లే నిదర్శనం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది 2014-15 యాసంగిలో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, నేడు 2021 యాసంగిలో 92లక్షల మెట్రిక్ టన్నులకు చేరడం..అంటే 594 శాతం కొనుగోళ్లు పెరిగాయి, ఇదీ యావత్తు తెలంగాణ రైతాంగం యొక్క విజయంగా అభివర్ణించారు.

ఏప్రిల్ మొదటివారంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కొరకు 6, 968 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం, దాదాపు రెండున్నర నెలలపాటు కొనుగోళ్ల ప్రక్రియను నిర్విరామంగా సాగించి రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రైతుల నుంచి రూ.17,300 కోట్లు విలువ చేసే 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్లు ముగియడంతో రాష్ట్రంలోని 6,968 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. గత ఏడాది యాసంగి కంటే 28 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా అదనంగా 12 లక్షలు (13 శాతం) అధికంగా కొనుగోలు చేశామని తెలిపారు. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 17,300 కోట్లు కాగా రవాణా, గన్నీ సంచులు, సోసైటీ కమీషనకు అదనంగా దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వ్యయం అవుతుందన్నారు.

23 జిల్లాల్లో ముందస్తు అంచనాలకు మించి వంద నుంచి 225 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. అత్యధికంగా గద్వాల్ లో 125 శాతం, నారాయణపేటలో 95 శాతం, రంగారెడ్డిలో 83 శాతం, నిర్మల్ లో 44 శాతం, వరంగల్ (రూరల్)లో 64శాతం, సంగారెడ్డి, 32 శాతం, భూపాలపల్లిలో 33, వికారాబాద్ లో 44 శాతం కొనుగోళ్లు పెరిగాయన్నారు. సమైక్య రాష్ట్రంలో మన అవసరాలకు, పేదలకు రేషన్ బియ్యం ఎక్కడో పంజాబ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి. అవి కూడా తినడానికి అంత అనువుగా ఉండేవి కావు… నేడు మన రాష్ట్రంలో పండిన బియ్యాన్ని మనం తినడమే కాకుండా దేశానికి కూడా అందిస్తున్నాం. గత ఏడాది భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన బియ్యంలో తెలంగాణ వాట 55 శాతం ఉంటడం మన అందరికి గర్వకారణమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం, మార్గదర్శకాల మేరకు పెరిగిన దిగుబడులకు అనుగుణంగా పౌరసరఫరాల సంస్థ చేపట్టిన చర్యలు రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. అంతేకాకుండా దేశంలో ఏరాష్ట్రానికి సాధ్యంకాని విధంగా తెలంగాణ పౌరసరఫరాల సంస్థ వందశాతం వరి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూ దేశానికే కొత్త మార్గాన్ని చూపిస్తోందని సంస్థ చైర్మన్ మారెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలు మెట్రిక్ టన్నులు:
నల్లగొండ- 7,83,574
నిజామాబాద్- 7,55,819
సూర్యా పేట- 6,49,192
జగిత్యాల- 5, 52,794
సిద్దిపేట- 5,40,049
కామారెడ్డి- 4,51,154
మెదక్- 4,41,130
కరీంనగర్- 4,14,859
యాదాద్రి- 4,06859
పెద్దపల్లి- 3,89,601

తెలంగాణ రాష్ట్రాన్ని రైతు రాజ్యంగా మార్చాలి, రైతును రాజును చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అంతిమ లక్ష్యం, ఈ లక్ష్యం చేరుకోవడానికి ఇప్పటికే ఎన్నెన్నో రైతు సంక్షేమ చర్యలను చేపట్టి అమలు చేస్తున్నారు. సీఎం తీసుకున్న రైతు సంక్షేమ చర్యల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయింది. ధాన్యం దిగుబడులు కొనుగోళ్లు ఏటేటా పెరిగిపోతున్నాయి. రైతులకు 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, సకాలంలో రైతులకు ఎరువుల పంపిణీ, రైతువేదికలు, మిషన్ కాకతీయ లాంటి పథకాలు అధిక దిగుబడులు రావడానికి తోడ్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, మార్గదర్శకత్వంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తిచేశామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -