బాహుబలి 2′ బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీలో ఎన్నో రికార్డులు కొట్టుకుపోతున్నాయి. బాహుబలి ప్రవాహానికి భారత చలనచిత్ర పరిశ్రమ సాహో అంటోంది. బాహుబలి ముందు తర్వాత అనేలా పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుని పోతున్నాయి. తాజాగా వెయ్యికోట్ల మార్కును కూడా దాటేసిన భారతీయ సినిమాగా ఇది చరిత్ర పుటలకు ఎక్కడంతో దర్శకుడు రాజమౌళిని అందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులు జక్కన్నపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 అద్భుత విజయం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “ఊహించనిది జరిగింది. రూ. 1000 కోట్లు. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. నాతో పాటు మొత్తం తెలుగు సినీ రంగం గర్వించేలా చేసిన రాజమౌళి, యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశాడు.
అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ‘బాహుబలి 2 చిత్రం వెయ్యి కోట్ల మార్కును అధిగమించిన సందర్భంగా శ్రీ రాజమౌళి, శ్రీ ప్రభాస్ లతో పాటు చిత్రం యూనిట్ అందరికీ హృదయపూర్వక తెలిపారు. రాజమౌళి ఏళ్లపాటు పడిన కష్టం, అంకితభావం, పట్టుదల మనల్ని గర్వపడేలా చేశాయి. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఇంతకుక్రితమే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి వెంటనే స్పందించిన రాజమౌళి ‘థ్యాంక్యూ వెరీ మచ్ సార్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
The unthinkable has happened! 1000 crores & counting! Thankyou @ssrajamouli & team for making me & the entire Telugu film fraternity proud:)
— Mahesh Babu (@urstrulyMahesh) May 7, 2017