‘మ్యాడ్’ ఫీల్ గుడ్ మూవీ..

29
- Advertisement -

వైవిధ్య భరిత చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు చిత్రం బృందంతో పాటు, ‘జాతిరత్నాలు’ ఫేమ్ దర్శకుడు అనుదీప్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సినిమాలో అనుదీప్ కూడా నటించడం విశేషం.

ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “దర్శకుడు కళ్యాణ్ నాకు పదేళ్లుగా స్నేహితుడు. కళ్యాణ్ లో చాలా ఎనర్జీ ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది. ఎప్పుడూ మంచి కథలు రాస్తుంటాడు. ఈ సినిమా చాలా ఎనర్జీతో, చాలా హ్యూమర్ తో ఉంటుంది. కొత్తవాళ్ళని ప్రోత్సహిస్తూ నాగవంశీ గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మీరందరూ అక్టోబర్ 6 థియేటర్లలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

అనుదీప్ మాట్లాడిన సమయంలో నిర్మాత నాగవంశీ కాసేపు యాంకర్ అవతారం ఎత్తారు. “మీరు సినిమా చూశారు కదా. మ్యాడ్, జాతిరత్నాలు ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బాగుంది” అని నాగవంశీ అడగగా.. “మ్యాడ్ సినిమానే ఎక్కువ బాగుంది. నాకు బాగా నచ్చింది” అని అనుదీప్ సమాధానం ఇచ్చారు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మొదట చినబాబు గారిని కలిసి ఈ కథ చెప్పగా, ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో మ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి పిచ్చోళ్ళ కోసం వెతుకుతుంటే ఫస్ట్ సంగీత్ దొరికాడు. హలో వరల్డ్ అనే సిరీస్ చూసి రామ్ ని వంశీ అన్న పిలిపించారు. మన సినిమాని ముందుకు తీసుకోవడానికి ఒక హీరో కావాలి అనుకున్నప్పుడు ఒక్క యాక్షన్ వీడియో చూసి నార్నే నితిన్ ని ఎంపిక చేశాం. నిర్మాత హారిక గారు స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్ వరకు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. వంశీ గారు చెప్పినట్టు మీకు డబ్బులు వెనక్కి రావు. అంతలా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యాడ్ చిత్రంలోని పాటలను పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. అక్టోబర్ 6న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.

- Advertisement -