లోకేష్ రాహుల్,రిషబ్ పంత్ ఇప్పుడు ఇవే పేర్లు క్రికెట్ అభిమానుల గుండె తలుపుతడుతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ దగ్గరి నుంచి సీనియర్ ఆటగాళ్ల వరకు అందరి మన్ననలు పొందుతున్నారు. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టు.. 121 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన జట్టు.. 300 పరుగులు దాటుంతుందని అనుకుంటామా! అదంతా వీరి ఆటముందు ఏమాత్రం తెలియలేదు.
అభిమానులకు అసలైన క్రికెట్ ఆనందాన్ని కలిగిస్తూ.. ప్రత్యర్థికి విసుగు తెప్పిస్తూ చుక్కలు చూపించారు. బంతి బ్యాట్ మీదకు రాకపోయినా.. ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్, స్వింగ్ అవుతున్నా ఎక్కడా తొణక్కుండా ఆడిన రాహుల్-రిషబ్ ఇంగ్లాండ్ వెన్నులో వణుకు పుట్టించారు. ముఖ్యంగా పంత్ ఈ సిరీస్లో తొలిసారి తన బ్యాట్ పవర్ చూపించాడు.
మరోవైపు రాహుల్ చూడముచ్చని షాట్లతో అలరించాడు. భారత్ ఓడిపోయినా అందరి మనసు గెలుచుకున్నారు.
దూకుడుకు సరికొత్త నిర్వచనం చెబుతూ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ గొప్పగా బ్యాటింగ్ చేశారని సచిన్ తెలిపారు. వీళ్లిద్దరి భాగస్వామ్యం ఈ సిరీస్లో చెప్పుకోదగ్గ విషయాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు. ఆఖరి వరకు పోరాటాన్ని విడవకుండా కేఎల్ రాహుల్, రిషబ్ చిరస్మరణీయ సెంచరీలు సాధించారని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. టెస్టు క్రికెట్లో పరుగుల ఖాతాను సిక్స్తో ప్రారంభించి సిక్స్తోనే సెంచరీ పూర్తి ఆకట్టుకున్నావ్ పంత్ అంటూ ట్వీట్ చేశాడు సెహ్వాగ్.
అంతేగాదు ఈ మ్యాచ్ ద్వారా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు రిషబ్ పంత్.మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్లో శతకం చేసిన మొదటి భారత వికెట్ కీపర్గా నిలిచాడు పంత్. సిక్సర్తో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్మెన్ పంత్. ఇంతకుముందు కపిల్దేవ్, హర్భజన్సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఈ ఘనత సాధించారు.