ఇప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం. ప్రభుత్వ, ప్రైవేటు సేవలు ఏం కావాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు కాపీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొబైల్ నెంబర్లను ఆధార్ తో లింకు చేయాలని తప్పని సరి నిబంధన చేసింది. ఫిబ్రవరి, 2018 లోపు ఆధార్ లింకు చేయని ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్లను డీయాక్టివేట్ చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తప్పనిసరిగా ఆధార్ను మొబైల్ నెంబర్కు లింక్ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.

మొబైల్ నెంబర్లతో ఆధార్ కార్డును లింక్ చేస్తే సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించవచ్చని, తప్పుడు సిమ్ కార్డులు వాడుతున్నవారిని గుర్తించవచ్చని, సిమ్ కార్డులతో ఆధార్ కార్డు లింకు ప్రక్రియను ఏడాది లోపు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు బయోమెట్రిక్లు తీసుకోకుండా సిమ్కార్డు జారీ చేయరాదని టెలీకం కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం నేరచరిత కలిగిన వ్యక్తుల బయోమెట్రిక్ వివరాలు మూడేళ్ల వరకు యూఐడీఏఐ వద్ద ఉంటాయి. టెలీకం స్టోర్లు ఆధార్ బయోమెట్రిక్లను తీసుకొని యూఐడీఏకు పంపినప్పుడు నేరస్థులను సులువుగా గుర్తించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. మరి భవిష్యత్ లో ఈ కార్యక్రమం ఏ మేరకు విజయవంతమవుతుందని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

