మరోసారి మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్‌..

249
ktr
- Advertisement -

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందువరుసలో ఉండే కేటీఆర్ ఈసారి వైద్యం చేయించుకోలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్న బూడిద నవీన్‌గౌడ్‌కు అండగా నిలిచారు. అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఆదుకోవాలంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్న బుడిద నవీన్‌గౌడ్‌ ట్విట్టర్‌లో చేసిన విజ్ఞప్తికి వెంటనే కేటీఆర్‌ స్పందించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన బూడిద నవీన్‌గౌడ్ (33) ఆరునెలల కిందట ప్రమాదవశాత్తు కిందపడటంతో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. పొట్టభాగంలో నీరుచేరి కదలలేని స్థితికి చేరుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్ని నెలల నవీన్ తల్లి చనిపోయింది, నవీన్‌ చిన్నతనంలోనే నాన్న చనిపోగా.., తమ్ముడు, చెల్లి బాధ్యత అతడిపై పడింది. ప్రస్తుతం నవీన్‌కు తమ్ముడు, చెల్లి సపర్యలు చేస్తున్నారు. నవీన్‌ పని చేస్తేగాని పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కుటుంబం ఆర్థిక ఇబ్బందు తలెత్తాయి.

కొద్ది రోజుల క్రితం నవీన్ వైద్యులను సంప్రదించగా.. బేరియాట్రిక్ సర్జరీ చేయాలని, ఇందుకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. తన అనారోగ్య పరిస్థితిని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల రమేశ్ సాయంతో ఆదివారం ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు విన్నవించారు. అది చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి సోమవారం ఉదయం హైద్రాబాద్‌లోని నిమ్స్‌ హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలని తెలిపారు. అంతేకాదు కేటీఆర్‌ పీఆర్‌ఓతో నవీన్‌కు ఫోన్ చేయించి.. హాస్పిటల్లో లైన్‌లో నిలబడకుండా నేరుగా వైద్య అధికారులను కలవాలని తెలిపారు, నవీన్‌గౌడ్‌కి పూర్తి వైద్యం అందించేందుకు కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నట్టు పీఆర్వో చెప్పారు. కేటీఆర్ చేసిన సహాయానికి నవీన్‌ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -