మంత్రి పొంగులేటిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన కేటీఆర్.. “దీపావళికి బాంబులు పేలుతాయని చెప్పారు. రెండు దీపావళిలు గడిచిపోయాయి కానీ బాంబులు మాత్రం పేలలేదు” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈడీ దాడుల భయంతోనే పొంగులేటి మోదీ, అదానీ కాళ్లుపట్టి కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి మోకరిల్లారని ఆరోపించారు.
ఇంకో మంత్రి తుమ్మల ప్రవర్తనపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. “నేను వస్తున్నా అంటూ కార్పొరేటర్ల ఇళ్లకు తిరిగి ముగ్గురిని ఎత్తుకొని రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లాడు. కానీ ప్రజలు అనుకుంటే ఎంతమంది కార్పొరేటర్లను తీసుకెళ్లినా తుమ్మల పీకేది ఏమీ ఉండదు” అని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం వచ్చినా భయపడబోమని, యువతకు అవకాశాలు ఇచ్చి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.పొంగులేటి ఆర్మీ రవి అనే తమ్ముడిపై కేసులు పెట్టించి జైలుకు పంపాలని ప్రయత్నించారని, కానీ అదే రవి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి పొంగులేటి అహంకారంపై చావు దెబ్బ కొట్టాడని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతులు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు.
“మార్పు మార్పు అన్నారు… ఇదేనా మార్పు?” అని ప్రశ్నించిన కేటీఆర్, “పాలు ఇచ్చే గేదెను తన్ని, దున్నపోతును తెచ్చుకున్న పరిస్థితి” అంటూ ప్రజల మాటలను ఉదహరించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు 30 శాతం కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. “వీళ్లు ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్లు. ఈ మోసగాళ్లకు అసలైన నాయకుడు అలీ బాబా” అంటూ కేటీఆర్ తీవ్ర పదజాలంతో దాడి చేశారు.
Also Read:ఎన్డీయే కూటమిలో పీఎంకే!

