తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ శాసనసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాదుకు కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు వరద సహాయం చేయలేదని అన్నారు. హైదరాబాదుకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మనసు రావడం లేదని.. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు.
ఇదే సమయంలో కంటోన్మెంట్ అధికారులపై ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తానని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట వినకపోతే కఠిన చర్యలకు కూడా వెనకాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో చెపుతున్నానని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

