అగ్నిపథ్ అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత- కేటీఆర్

66
ktr minister
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకం పున సమీక్ష చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారకరామారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో, మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతుల గోసగుచ్చుకున్న కేంద్రం, ఇప్పుడు ఈ విధానంతో జవాన్లను నిర్వేదంలోకి నెడుతున్నదని అన్నారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఇలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. రైతులను సంప్రదించకుండా నల్ల చట్టాలు, వ్యాపారులను సంప్రదించకుండా జీఎస్టీ, దేశపౌరుల బాధలను పరిగణలోకి తీసుకోకుండా డిమానిటైజేషన్, లాక్ డౌన్, మైనార్టీలతో చర్చించకుండా సిఎఎ వంటి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేంద్రంలోని నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం, తాజాగా దేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా అనాలోచితంగా అగ్నిపథ్ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. పైగా తమ ప్రయోజనాల కోసం ఆందోళన చేస్తున్న యువకులు పైననే నెపాన్ని నెట్టే దుర్మార్గపు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈరోజు ఈ వివాదాస్పద విధానానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో యువకుడి మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేవలం తమ అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం యువకుల ప్రాణాలను బలిగొంటున్నది అన్నారు. కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి కేటీఆర్ తన సానుభూతిని ప్రకటించారు.

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకంపై అనేక అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు, పరిపాలనా నిర్ణయాలవల్ల దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్న ప్రస్తుత నేపథ్యంలో, దేశానికి సేవచేస్తూనే, ఆర్మీ ఉద్యోగంకోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది యువత అశలను వంచించే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశభద్రతను సైతం కాంట్రాక్ట్ విధానానికి అప్పజెప్పడం దేశభద్రతపై వారి డొల్లవిధానాలకు నిదర్శనమన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా దేశభద్రతతో పాటు దేశయువత భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ఈ విధానం ద్వారా కేవలం నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీలో విధులు నిర్వహించిన యువతలో 75 శాతం తిరిగి నిరుద్యోగులుగా మారతారన్నారు. సైనిక దళంలో చేరి దేశానికి సేవచేయాలని కలలు కంటూ, సంవత్సరాలపాటు ఉద్యోగానికి సన్నద్దమయ్యే యువత, కనీసం అన్ని సంవత్సరాలు సైతం ఉద్యోగంలో ఉండేందుకు అవకాశం లేదన్నారు.

అత్యంత కీలకమైన యుక్త వయసులో ఆర్మీలో చేరి నాలుగు సంవత్సరాలకే బయటకు పంపిస్తే, తర్వాత వారికి ఉపాధి అవకాశాలు దక్కే ఛాన్సే లేవన్నారు. ఇప్పటికే సంవత్సరాలపాటు అర్మీలో పనిచేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఇలాంటి సందర్భంలో సైన్యంలో భర్తీ అయిన 75 శాతం మంది యువకులను ప్రతియేటా నిరుద్యోగులుగా మార్చే ఈ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని కేటీఆర్ అన్నారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చిన అగ్నీవీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధిఅవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్దమన్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ చెప్పిన ప్రైవేటురంగంలో ప్రతియేటా రెండుకోట్ల ఉద్యోగాలు ఎంత నిజమో దేశయువతకి తెలుసని ఎద్దేవాచేశారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండే గ్రామీణప్రాంత యువత ఆర్మీఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుందని, అలాంటి గ్రామీణయువత నాలుగేళ్ల తర్వాత పోటీ అధికంగా ఉండే ప్రైవేటురంగంలో ఉపాధిపొందే అవకాశాలు తక్కువగా ఉంటాయని కేటీఆర్ అన్నారు. దేశరక్షణకు సంక్షోభ సమయాల్లో కేవలం శిక్షణకలిగిన నూతన సైనికులతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉండాల్సిన అవసరం చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. ఈ వివాదస్పద విధానంతో దశాబ్దాలుగా అర్మీలో నిర్మాణమైయున్న సంస్థాగత సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలకు భంగంకలిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశానికి పొరుగుదేశాలతో అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.

దేశభద్రత కన్నా కేవలం ఆర్థికపరమైన అంశాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరమన్నారు. పెన్షన్ డబ్బులను ఆదాచేసేందుకు కేంద్రం చేపట్టిన చౌకబారు ఎత్తుగడనే ఈ వివాదస్పద విధానమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ తీసుకున్న అనేకనిర్ణయాలు దేశప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం డిమానిటైజేషన్, నల్లవ్యవసాయ చట్టాలు వంటి వాటి విషయంలో నిరూపితమైందన్నారు. ఇప్పుడు బీజేపీ చేపట్టిన అగ్నిపథ్ పథకం నిర్ణయంపై తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతున్న తీరు, దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమన్నారు. నిరుద్యోగ యువతలో కేంద్రప్రభుత్వంపై ఉన్న అగ్రహానికి ఈ అందోళనలు అద్దం పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి దేశ యువకుల ఆవేదనను అర్థం చేసుకొని ఈ విధానాన్ని వెంటనే సమీక్షించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఏ సంక్షోభం వచ్చినా మౌనాన్ని ఆశ్రయించే ప్రధాని నరేంద్రమోడీ, ఈ కీలక విషయంలో ఎప్పటిలాగే దాటవేయకుండా, వెంటనే తమవైఖరిని స్పష్టంచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానంపైన అందోళన చేస్తున్న దేశయువత అనుమానాలను, అవేదనను తాము అర్ధం చేసుకుంటామని, ఈ విధానంపైన సమీక్షకు వారి పక్షాన కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -