వికారాబాద్ మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష..

233
Ktr
- Advertisement -

వికారాబాద్ జిల్లాలోని మునిసిపాలిటీలపైన పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖ మంత్రి పి సబితాఇంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ హాజరైన ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని మునిసిపాలిటీల అభివృద్ధి పైన చర్చించారు. గత వారం కోస్గి, కొడంగల్ మునిసిపాలిటీల పైన సమావేశం నిర్వహించగా ఈ రోజు వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాల పైన సమీక్ష జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పురపాలక పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వాటిని వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈ మేరకు ఈ మూడు పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానిక పురపాలక కమిషనర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పట్టణాల ఆదాయ వనరులు, ఖర్చు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల పైన మంత్రులు ప్రజా ప్రతినిధులు చర్చించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులను కోరారు. దీంతోపాటు మూడు పట్టణాల్లో పార్కులు, ఫుట్ పాత్ లు, రోడ్లు, టాయిలెట్ నిర్మాణం, స్మశాన వాటికల లో అభివృద్ధి మొదలైన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మూడు పట్టణాల మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -