కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్

14
- Advertisement -

ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రేస్ పార్టీ సొంతమని, గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ అన్నారు. ఇప్పటి మాదిరే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ని తిరస్కరించి కాంగ్రేస్ గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రేస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రేస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ వాస్తవం, చరిత్ర మనం మరువగూడదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రేస్ పార్టీకి వుండదన్నారు.రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందన్న కెటిఅర్, వచ్చిన తెల్లారినించే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రేస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదన్నారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనా పోకడలే సాక్ష్యం అన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రేస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రేస్ పార్టీ మీద వత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుందని కెటిఅర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని, మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమేనని కెటిఅర్ గుర్తు చేశారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుళ్లో కేసీఆర్ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారం లో ఉండటం కన్నా ప్రతిపక్షం లో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని, సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంటు నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయని, త్వరలోనే రాష్ట్ర ,జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తాన్నారు.

ఖమ్మం లోక్ సభ నియోజక వర్గం సన్నాహక సమావేశానికి హజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదమన్నారు. ఇప్పటికీ జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణను గెలిపించిందని, పదేండ్ల అనతికాలం లోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందన్నారు. తెలంగాణ గళ౦ బిఆర్ఎస్. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే అని, రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళం గా ఐకమత్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుదుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బిఆర్ఎస్ శ్రేణులదేఅన్నారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తి తో, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందాని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనీ గెలిపించుకుందామన్నారు.

Also Read:ఆవాల నూనెతో ప్రయోజనాలు!

- Advertisement -