కరోనా సంభోభంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ….రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని…ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు 11 చెక్డ్యాంలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతుబంధు అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. ఈ సారి రికార్డు స్ధాయిలో ధాన్యం కొనుగోలు చేశామని…తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారిందని ఎఫ్సీఐ సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు మంత్రి కేటీఆర్.

