ఫోన్ త‌క్కువ‌గా వాడితేనే లాభం- మంత్రి కేటీఆర్

100
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్, సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుబాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నిన్న కాక మొన్న శాస‌న‌స‌భ‌లో 90 వేల ఉద్యోగాల‌కు సంబంధించి సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో మొద‌టిసారిగా ఉచిత కోచింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన ఘ‌న‌త మ‌ల్లారెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. కోచింగ్ సెంట‌ర్‌లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. 3 నుంచి 4 నెల‌ల పాటు ఈ కోచింగ్ సెంట‌ర్ కొన‌సాగుతుంది. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్లాసులు కొన‌సాగుతాయి. మ‌ధ్యాహ్న భోజ‌నంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వ‌నున్నారు. ఒక లైబ్ర‌రీని ఏర్పాటు చేయాల‌ని నిర్వాహ‌కుల‌కు కేటీఆర్ సూచించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో కొవిడ్ కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య‌, నిపుణ చానెల్‌ను ప్రారంభించామ‌ని కేటీఆర్ తెలిపారు. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో ల‌భ్య‌మ‌వుతుంద‌న్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాల‌ని సూచిస్తున్నాను. మీ కోసమే ప్ర‌భుత్వం ఇన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు తీసుకుంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఒక్కో ప్ర‌భుత్వ ఉద్యోగానికి ప‌దుల సంఖ్య‌లో పోటీ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పోటీత‌త్వంతో గ‌ట్టిగా చ‌దివితే ఉద్యోగం వ‌స్త‌దనే విశ్వాసం వ‌స్తుంది. ఒక వేళ ఉద్యోగం రాక‌పోయినా బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి. 13 వేల ప‌రిశ్ర‌మ‌లు ప‌నులు ప్రారంభించాయి. మ‌రో 6 వేల ప‌రిశ్ర‌మలు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. ప్ర‌యివేటు రంగంలో కూడా వేల సంఖ్య‌లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాం. తెలంగాణ పిల్ల‌ల‌కు కొలువులు ఇచ్చిన‌ట్లు అయితే ప్రోత్సాహ‌కాలు ఇస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌యివేటు రంగంలో క‌చ్చితంగా మ‌న పిల్ల‌ల‌కే సింహ భాగం అవ‌కాశాలు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. టీ హ‌బ్, వీ హ‌బ్ లాంటి సంస్థ‌ల్లో కూడా పారిశ్రామిక ఔత్సాహికుల‌కు ప్రోత్సాహ‌కాలు క‌ల్పిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

6 నెల‌లు సినిమాల‌కు దూరంగా ఉండండని కేటీఆర్ సూచించారు. కొద్దిగా క్రికెట్ త‌క్కువ చూడండి. ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల‌ను బంద్ చేసి చ‌దువుపై దృష్టి సారించండి. ఫోన్ త‌క్కువ‌గా వాడితేనే లాభం ఉంటుంది. మీ త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టే విధంగా భ‌విష్య‌త్‌కు ప్ర‌ణాళికలు వేసుకోవాల‌ని ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు మంత్రి కేటీఆర్ సూచించారు.

- Advertisement -