పట్టణాల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష..

291
- Advertisement -

నర్సంపేట పట్టణ రూపురేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్‌లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పట్టణ పురపాలిక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పన పైన మంత్రి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికి 20 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను నర్సంపేట మున్సిపాలిటీ ఇచ్చామని, ఈ నిధుల ద్వారా పట్టణంలోని కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

KTR held a review meeting

ఈ సమీక్షా సమావేశం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, రోడ్లు పార్కులు, చెరువులు, స్మశాన వాటిక వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నిధులతో ముందుగా పట్టణ సుందరీకరణతో పాటు, జంక్షన్ అభివృద్ధి, కుమ్మరి కుంట వద్ద పార్కు ఏర్పాటు, పట్టణ రోడ్లకి ఎల్ఈడీ లైట్లు బిగింపు, మోడల్ మార్కెట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రాధాన్యత ఇచ్చి ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక నిధులతో చేపట్టేటువంటి కార్యక్రమాలను అక్టోబర్ నాటికి పూర్తయ్యా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, ఈ మేరకు ఆయా కార్యక్రమాలకు టెండర్లను పూర్తి చేయాలన్నారు. పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ గురించి మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

నర్సంపేట కోసం ప్రత్యేకంగా ఒక్క డంపు యార్డును ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్వచ్ఛ ఆటోలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలన్నారు. మున్సిపాలిటీ ఆదాయం ఖర్చులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అనేక పురపాలికలు 100% ఆదాయపు పన్ను కలెక్షన్లను సాధించాయని ఈ సంవత్సరమైనా 100% ఆదాయపన్ను లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. నర్సంపేట పట్టణ అభివృద్ధి మరియు విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అక్రమ లేఔట్లను ఏ మాత్రం సహించేది లేదని, అలాంటి వాటి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ను ఆదేశించారు.

Narsampet Municipality review meeting

నర్సంపేట అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలను కేటాయించడంతోపాటు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీ రామారావు కు , రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దిశానిర్దేశం చేసిన మేరకు మౌలిక వసతుల కార్యక్రమాలను అక్టోబరు నాటికి పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు అంతా కలిసి ముందుకెళ్తామ న్నారు. మంత్రి సూచించిన కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించేందుకు ఆగస్టు మాసంలో నర్సంపేట పట్టణంలో పర్యటించాల్సిందిగా మంత్రిని సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ సమీక్ష సమావేశంలో సిడి ఎం ఏ శ్రీదేవితో పాటు ఇతర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -