బుధవారం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రమాదవశాత్తు మరణించిన 80 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ రూ. 2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి టీఆర్ఎస్ భవన్లో భోజనం ఏర్పాటు చేశారు. చెక్కుల పంపిణీ అనంతరం కేటీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో వారితో ముచ్చటిస్తు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ భవన్కు వచ్చిన 80 మంది కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త, సోదరుడు, కుమారుడు ఎవరైనా కావొచ్చు.. వివిధ ప్రమాదాల్లో మరణించారు. అలాంటి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది. కేసీఆర్ అండగా ఉంటున్నారు. ఈ కుటుంబాల స్థితిగతులను పార్టీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. మాకు ఇల్లు లేదు అని కొంతమంది.. పిల్లలు చిన్నవారు ఉన్నారు.. గురుకులాల్లో అడ్మిషన్స్ కల్పించాలని కోరారు. చదవుకున్న అమ్మాయిలు ఉన్నారు.. తమకేదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు. చనిపోయిన తర్వాత పెన్షన్ రావట్లేదని తెలిపారు. మీ అందరికీ తాము అండగా ఉన్నాం. రాబోయే పదిహేను రోజుల్లో మీరు అడిగిన పనులు చేసిపెట్టే బాధ్యత తమదే అని కేటీఆర్ స్పష్టం చేశారు.