బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..

50
ktr minister
- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్‌ తన న్యాయవాది చేత బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయితే బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని అని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.

అయితే బండి సంజయ్‌ దీనిపై స్పందించకపోవడంతో ఈ రోజు కేటీఆర్ తరఫున న్యాయవాది బండి సంజయ్‌కి లీగల్‌ నోటీసులు పంపించారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న ఉద్దేశంతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్‌కు ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారన్నారు న్యాయవాది.

మంత్రి కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్‌కు పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసులో పేర్కొన్నారు న్యాయవాది. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్‌ తరఫు న్యాయవాది.

- Advertisement -