కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భావ స్వేచ్ఛ , పత్రికా స్వేచ్ఛపై రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. స్వతంత్ర భారతదేశంలో మొదటి సారిగా ఎమర్జెన్సీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి స్వేచ్ఛను హరించి, పౌరుల హక్కులను కాలరాసింది కాంగ్రెస్ పార్టేనని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ అమరవీరులను కాల్చి చంపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని, తెలంగాణ అమరవీరులకు రాహుల్ గాంధీ నివాళులర్పించడం బాధాకరమని, కాల్చిచంపిన వారే నివాళులర్పిస్తున్నారని, ఆనాడు 1969 ఉద్యమంలో ఇందిరాగాంధీ హాయాంలోనే తెలంగాణ బిడ్డలను కాల్చిచంపారని, 2009 నుంచి 2014 మద్య కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడంతోనే వందలాది బిడ్డలు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని వారందరికి కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కాని క్షమాపణ కోరుతారా అని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
మరో అంశం అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం ఓ జోక్ అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అవినీతి గురించి రాహుల్ మాట్లడకపోతే బాగుంటుందని, రాహుల్ సభల్లో పాల్గొన్న నాయకుల్లో సగం మంది అవినీతి కేసుల్లో ఇరుక్కుని బెయిల్పై వచ్చిన వారేనని, కొందరు కాంగ్రెస్ నాయకులైతే సీబీఐ కేసుల్లో ఇరుకున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పెట్టింది పేరని, కాంగ్రెస్ పార్టీ స్కామ్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు.