పార్టీ కార్యకర్త బిడ్డకు కేటీఆర్ సర్ ప్రైజ్ గిఫ్ట్..

127
KTR
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బిడ్డక పుట్టినరోజున మంత్రి కేటీఆర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించారు. వివరాల్లోకి వెళ్లితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నగరంలో గత 20 రోజులుగా ఉంటూ, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన భాద్యతలను నిర్వర్తించడానికి, ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండటంతో అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా హైదరాబాద్ లోనే ఉంటూ పార్టీ అప్పజెప్పిన విధులను నిర్వహించారు.

మరోవైపు.. ఖాజా నవాజ్ హుస్సేన్ భార్య తొమ్మిది నెలల గర్భవతి. అయినప్పటికీ ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ భార్యకు దైర్యం చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతోంది. శుక్రవారం రోజున టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయం తన దృష్టికి రావడం జరిగింది. పార్టీ కార్యకర్త నిబద్ధతకు చలించిపోయిన కేటీఆర్ ఖాజా నవాజ్ హుస్సేన్ యోగక్షేమాలు విచారిస్తున్న సందర్భంలో.. శనివారం తన కూతురు నబీలా మహమ్మద్ పుట్టిన రోజు విషయం ప్రస్తావించడం జరిగింది. వెంటనే పుట్టిన రోజు కానుకగా సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను పాపకు అక్కడి పార్టీ నాయకుల ద్వారా కేటీఆర్ అందించడం జరిగింది. అంతేకాదు పాపకు స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఇంకా ఏం కావాలి అంటూ కేటీఆర్ పాపను అడుగగా, నాకేమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే చాలు అన్న పాప సమాధానం విని కేటీఆర్ చలించిపోయారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం అని కేటీఆర్‌ తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీకి బలం కార్యకర్తల నిబద్దత.. వారి త్యాగాలే అని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, వారికి ఏ ఆపద వచ్చినా వారికి, వారి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం ఎత్తిన గులాబీ జెండా.. రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -