నా బర్త్‌డే వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దు.. కేటీఆర్ విజ్ఞప్తి..

121
- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, పార్టీ శ్రేణులంతా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో శనివారం తాను ఎవరిని కలవడం లేదని, ఈ విషయంలో అన్యధా భావించవద్దని పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు.

ఇప్పటికే విజ్ఞప్తి చేసిన మేరకు తమకు తోచిన విధంగా ఎవరికి వారు ఇతరులకు సహాయం అందిస్తూ,  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమాన్ని వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక విజ్ఞప్తులు మంత్రి కేటీఆర్‌కు వస్తున్నాయని వాటన్నిటిని తమ కార్యాలయం క్రోడీకరించి, ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందజేస్తామని అని  తెలిపింది.

- Advertisement -