సూపర్ స్టార్లు కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించి చాలా కాలమైంది. ఈ ఇద్దరూ కలిసి నటించాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. ఎట్టకేలకు వారి ఆశ తీరబోతున్నట్టు సమాచారం. శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివతో మహేష్ బాబు.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ తండ్రి పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను కొరటాల శివ సంప్రదించినట్టు సమాచారం.
మహేష్ బాలనటుడిగా తన తండ్రి కృష్ణతో కలసి ఏడు చిత్రాలలో నటించాడు.1987లో మహేష్ బాబు తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి బాలనటుడిగా ద్విపాత్రభినయం చేశాడు. 1990 లో విడుదలైన బాలచంద్రుడు మరియు అన్న – తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు మహేష్. మహేష్ హీరోగా మారిన తరువాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ చిత్రాల్లో కృష్ణ కనిపించారు. ఆపై మహేష్ నటించిన ఏ చిత్రంలోనూ ఆయన స్వయంగా నటించలేదు.
ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్య మంత్రి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ సెట్ ని భారీగా నిర్మించనున్నారట. అసెంబ్లీలో మహేష్ ప్రసంగించే సన్నివేశాలతో పాటు ముఖ్యమైన సీన్స్ ఇక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం.
కాగా, ఈ చిత్రం ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటోంది. సూపర్స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్రాజ్లతోపాటు ప్రముఖ తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలతోపాటు పీటర్ హెయిన్స్ సారధ్యంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న భరత్ అను నేను చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11, 2018న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.