ఐపీఎల్ సీజన్-11లో మరో ఆసక్తికర పోరు జరిగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా అదరగొట్టింది. 25 రన్స్ తేడాతో రాజస్థాన్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 144 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ పోరాటం ముగిసింది. కోల్కతా నైట్రైడర్స్ ఇదే వేదికపై శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్ (50: 38 బంతుల్లో 4×4, 2×6), అజింక్య రహానె (46: 41 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడినా.. వీరిద్దరూ ఔట్ అనంతరం మిగిలిన బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఒకానోక దశలో గెలుపు దిశగా పయనించిన రాజస్ధాన్కు కోల్ కతా బౌలర్లు గట్టి షాకిచ్చారు. టాప్ ఆర్డర్ని దెబ్బ తీయడంతో ఆర్ ఆర్ గెలుపు కష్టంగా మారింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్ కతాకు ఆరంభంలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్లు త్వరలోనే వెనుదిరిగారు. రాజస్థాన్ స్పిన్నర్ ధాటికి వరుసగా సునీల్ నరైన్ (4), రాబిన్ ఉతప్ప (3), నితీశ్ రాణా (3), క్రిస్లిన్ (18) వికెట్లను చేజార్చుకుని 51/4తో కనిపించిన కోల్కతా.. ఆఖర్లో అసాధారణ రీతిలో పుంజుకుంది. డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆండ్రీ రసెల్.. వరుస సిక్సర్లతో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి స్కోరుని అమాంతం పెంచేశాడు. దినేశ్ కార్తీక్ (52: 38 బంతుల్లో 4×4, 2×6), ఆండ్రీ రసెల్ (49: 25 బంతుల్లో 3×4, 5×6) దూకుడుగా ఆడటంతో కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.