బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తులు, గుండెలో ఇన్ఫెక్షన్లు పెరగడంతో ఆమెను గత కొన్ని రోజులుగా ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి అనుకున్నంతగా మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆమెను అత్యాధునిక వైద్యం కోసం లండన్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
శనివారం రాత్రి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఖలీదా జియాను ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్కు పంపించారు. అక్కడ ఆమెకు అవసరమైన ఆధునిక చికిత్స, ప్రత్యేక వైద్య పర్యవేక్షణ లభించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
లండన్లో నివసిస్తున్న ఆమె కుమారుడు, బీఎన్పీ తాత్కాలిక చైర్పర్సన్ తారిక్ రెహమాన్ తల్లి అనారోగ్యంపై గాఢ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు అత్యుత్తమ చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, త్వరగా కోలుకోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ, ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఖలీదా జియా తాజా పరిస్థితి బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో ఆందోళనకు గురిచేస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read:ఓటీటీలోకి మిషన్ ఇంపాజిబుల్!

