కేజ్రీవాల్.. మీరు గ్రేట్ బాసూ..!

460
Aravind Kejriwal
- Advertisement -

కేజ్రీవాల్ మీరు గ్రేట్ బాసూ.. ఆయన సామాన్యుడికి ప్రత్యామ్నాయం.. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నామని బాధపడే వాళ్ళకి ఆయనొక మానసిక వైద్యుడు.. మనం అది చేయగలమా అని తడబడుతున్నవారికి ఆయనొక మార్గసూచి.. భయపడుతూ బతికేవారికి అతనో ధైర్యం.. ఒకసారి గెలిస్తే అది అదృష్టం అనుకోవచ్చు.. రెండోసారి అలాగే గెలిస్తే.. మూడోసారి గెలుస్తున్నాడంటే ఆయన కచ్చితంగా హీరో.. ఢిల్లీ గడ్డ మీద నిలబడి జెండా ఎగరేయడం అంత తేలికైన విషయం కాదు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు.. ఎన్నెన్నో అవమానాలకి గురి చేశారు.. సొంత పార్టీ వారితోనే వెన్నుపోటు పొడిపించారు..అయిన తట్టుకున్నాడు..నిలబడ్డాడు. అవినీతి మరకల్లేవ్.. దోచుకోవాలనే ఆలోచన లేదు..ఎవరినో వేధించాలనే కోరుకోడు.. పని చేసుకుంటూ పోతాడు..చీపురు పట్టుకుని ఊడ్చుకుంటూ పోతాడు.. ప్రజల్ని నమ్ముకుంటాడు..గెలుస్తూనే ఉంటాడు. ఆయనే అరవింద కేజ్రీవాల్.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతోంది. దీంతో వరుసగా ఢిల్లీ సీఎం పీఠాన్ని అరవింద్ కేజ్రీవాల్ అధిరోహించనున్నారు. జన లోక్‌పాల్ బిల్లుపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నిరసన దీక్షతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. అనంతరం రాజకీయ పార్టీని స్థాపించారు. తొలిసారిగా 2013 ఎన్నికల్లో పోటీచేసి మొత్తం 28 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 31 స్థానాలు సాధించినా, ఆప్‌కి అనూహ్యంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Kejriwal

2013 డిసెంబర్ 28 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకు అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా కొనసాగారు. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధించడంతో 2014 ఫిబ్రవరి 14 నుంచి 2015 ఫిబ్రవరి 15వరకు ఇది కొనసాగింది. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 70 స్థానాలకు గానూ 67 చోట్ల ఆప్ జయభేరి మోగించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లు దక్కించుకోగా, కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. దీంతో, రెండోసారి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

ఇటీవల ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కిపు జరుగుతోంది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు బరిలోకి దిగాయి. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం పలు ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా.. అందులో కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తున్న ఆప్ మూడోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకోనుందని అంచనా వేశాయి.

అంచనాలకు అనుగుణంగానే ఓట్ల లెక్కింపులో అప్‌ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 50 స్థానాల్లో ముందంజలో ఉంది. దీన్నిబట్టి మరోసారి ఢిల్లీలో కేజ్రీవాల్‌ జెండా ఎగురవేస్తాడానే చెప్పాలి. దీంతో మూడో సారి క్రేజ్రీవాల్‌ అధికారాన్ని కైవసం చేసుకోబోతుండడం విశేషం. కాగా ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బాస్‌ ఎవరు అవుతారన్న దానిపై స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -