ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: ఏపీ సీఎంవో

460
kcr jagan
- Advertisement -

హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ,ఏపీ సీఎంలు కేసీఆర్,జగన్ సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ భేటీ జరుగగా కొన్ని పత్రికల్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇద్దరు సీఎంలు అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు ప్రచురించారు. వీటిని ఖండించింది ఏపీ సీఎంవో.

ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని …ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికింది. ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది.

అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చ జరిగిందని ,తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని వెల్లడించింది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది.

గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని సీఎంవో పేర్కొంది.

- Advertisement -