బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తాం…

285
- Advertisement -

బలహీనవర్గాల (బిసిలు) కులాలకు చెందిన వారి జీవన ప్రమాణాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా వచ్చే బడ్జెట్లో బిసి సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. బీసీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.బీసీ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి బీసీ కులాల వారి సమగ్ర అభివృద్ధి కోసం తీసుకునే చర్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ ను నియమించనున్నట్లు సీఎం ప్రకటించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ పారశాలలు ప్రారంభించడంతో పాటు, బీసీ స్టడీ సర్కిళ్లను పకడ్బందీగా నిర్వహించడం అత్యంత ప్రాధాన్యతాంశమని సిఎం చెప్పారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారా సాధ్యమవుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. బిసి పిల్లల చదువు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం స్పష్టం చేశారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజవర్గానికి ఒకటి చొప్పున బిసి రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించాలని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ఈ పాఠశాలలు ప్రారంభం కావాలని, ఇందులో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలన్నారు. వచ్చే జూన్ నాటికే రెసిడెన్షియల్ పాఠశాలల బోధన, బోదనేతర సిబ్బంది నియామకం, విద్యార్ధుల చేరిక, వారికి వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సిలబస్, ఇతర విద్యా సంబంధ అంశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు.

trs

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ, మైనారిటీ గురుకులాలు నడుస్తున్నట్లే, అవే ప్రమాణాలతో బిసి గురుకుల పాఠశాలలు నడవాలని, అందుకోసం నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని సిఎం ఆదేశించారు. బిసి విద్యార్ధులకు గురుకులాల్లో మంచి విద్య, వసతి, బోజనం, దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందివ్వాలని ఆదేశించారు. ఆటస్థలంతో పాటు మంచి ప్రాంగణాన్ని బిసి గురుకులాల కోసం సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వివిధ స్టడీ సర్కిళ్లు నడుస్తున్నప్పటికీ. అవన్నీ కేవలం నామమాత్రంగానే ఉన్నాయని సిఎం అభిప్రాయపడ్డారు.

బిసి స్టడీ సర్కిళ్లతో పాటు అన్ని స్టడీ సర్కిళ్లలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందాలని సిఎం ఆకాంక్షించారు. స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన విద్యార్ధులు ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించే విధంగా, అకాడమీల తరహాలో వాటిని నిర్వహించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాని సిఎం ఆదేశించారు. బిసి గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ఇప్పటి నుంచే స్థలాన్వేషణ జరపాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిసి హాస్టళ్ల పరిస్థితి, భవనాలు, స్థలం తదితర అంశాలపై కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. వాటిని గురుకులాలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

kcr

నిరుపేద బిసిల సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బిసిల సంక్షేమం పేరిట గతంలో ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు హాస్యాస్పదంగా, నామమాత్రంగా ఉన్నాయని సిఎం అన్నారు. అలా కాకుండా నిజంగా బిసిలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆర్థిక సహాయ కార్యక్రమాలుండాలని చెప్పారు. అందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందించాలని, ఇందుకోసం సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. బిసిలకు సంబందించిన వ్యవహారాలను పరిశీలించి, ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ వేయాలని సిఎం ఆదేశించారు. బిసి కమిషన్ ఏర్పాటుకు సంబందించిన అదికార ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు. త్వరలోనే కేబినెట్ సమావేశమయి బిసి కమిషన్ ఏర్పాటుకు సంబందించిన అంశాలతో పాటు ఇతర విషయలను కూడా చర్చిస్తామని సిఎం ప్రకటించారు.

26న కేబినెట్ సమావేశం

రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమీషనరేట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న ఈ రెండు నగరాల్లో జనాభా, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖను పటిష్టం చేయాలని సిఎం ఆదేశించారు. ఈనెల 26 రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

- Advertisement -