ములుగును జిల్లా చేస్తాం: కేసీఆర్

224
kcr
- Advertisement -

ములుగును జిల్లా చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ములుగు ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ గిరిజనులు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే తండాలు,గోండు గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో 3వేల మంది గిరిజనులు,లంబాడాలు సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టబోతున్నారని చెప్పారు.

ములుగు సభకు ప్రభంజనంలా తరలి వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అటవీ ప్రాంతమైనా ములుగులో తెలంగాణ జెండా ఎగురుతోందని…చందులాల్‌ని లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు. 58ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఒకవైపు.. 14ఏండ్లు పోరాడి నాలుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్ ఒకవైపు ఉందని..ఎవరేం చేశారో మీ కళ్ళ ముందే కనిపిస్తోందని.. అనాలోచితంగా ఓటేస్తే ఐదేళ్లు బాధపడాల్సి ఉంటుందని గులాబీ అధినేత వివరించారు.

నరేంద్రమోడీ, అమిత్‌షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని… దేశాన్ని పాలించే వారు ఇంత అధ్వానంగా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిస్తున్న 19 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా?అని దుయ్యబట్టారు.

ములుగు పరిధిలోని తండా వాసుల కష్టం చూసే.. నేను కల్యాణలక్ష్మీ పథకాన్ని తీసుకువచ్చానని చెప్పారు. ప్రసవం కోసం మహిళలు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లితే ఆర్థిక దోపిడీకి గురయ్యే వారని తెలిపారు. రాష్ట్రంలో నీటితీరువా రద్దు చేశాం. మల్లంపల్లిని మండల కేంద్రంగా.. ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -