పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో అలుగెల్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు అడుగంటి ఎడారిగా మారడం పట్ల బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
“తలాపున పారుతుంది గోదారి నీ చేను నీ చెలుక ఎడారి”..అని నాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి కష్టాలను వివరిస్తూ, నాటి కవి సదాశివుడు రాసిన పాటను తిరిగి గుర్తుకుచేసుకునే పరిస్థితులు తలెత్తడం శోచనీయం అన్నారు.
ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోసను… కాళేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతను.. సభ్య సమాజానికి తెలిపేందుకు.. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్వర్యంలో…రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా 200 మందితో కూడిన 180 కిలోమీటర్ల పాదయాత్ర వారం రోజుల పాటు సాగి శనివారం ముగిసింది. ఈ ముగింపు సభ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవల్లిలో జరిగింది.
ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడుతూ.. పోయిన సంవత్సరం ఇదే రోజు నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయినాయో…. ఇందుకు కారణం ఎవరు అనే విషయాన్ని సభ్యాసమాజానికి తెలియజేసేందుకు కోరుకంటి చందర్ అధ్వర్యంలో పాదయాత్ర చేయడం అభినందనీయం… అని పాదయాత్రలో పాల్గొన్నప్రతీ ఒక్కరినీ కేసీఆర్ అభినందించారు.
కేసీఆర్ మాట్లాడిన ముఖ్యాంశాలు :
” తెలంగాణ ను కొట్లాడి సాధించుకున్నాం. ఎంతో జాగ్రత్తగా నిలబెట్టుకున్నం. ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నరు. అదీ వాళ్లిష్టం. కానీ దాని ఫలితం లోకం చూస్తున్నది..”
” ఇన్నాళ్ళు లేని నీటి గోస ఇప్పుడెందుకు వచ్చినట్టు..? తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలనే పాలనా ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే తెలంగాణకు సాగునీరు తాగునీరు సమస్య వచ్చింది.”
” తెలంగాణ పాలకులు మొదటి నుంచీ నీటి సమస్యను ఆర్ధిక సమస్యగా చూడడం ఒక అవలక్షణంగా మార్చుకున్నారు. గల్ఫ్ లాంటి ఎడారి దేశాల్లో నీళ్లుండవు. అక్కడి ప్రభుత్వాలు సముద్ర జలాలనుంచి ఉప్పును వేరుచేసి నీటిని శుద్ధి చేసి మంచినీరుగా వాడుకుంటారు. మద్రాస్ లో కూడా నీటి కొరతను అధిగమించేందుకు అటువంటి కార్యాచరణను చేపట్టారు. భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పనిచేయవలసి ఉంటుంది. అంతేతప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు. తెలంగాణకు సాగునీరు తాగునీరు అవసరం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు తాగునీరు వ్యవసాయానికి సాగు నీరు అందించాల్సిందే.”
” తెలంగాణ రాగానే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం, వ్యవసాయ స్థిరీకరణ కోసం దృష్టి సారించి పటిష్టమైన కార్యాచరణను అమలు చేసింది. రైతాంగ వ్యవసాయ అభివృద్ధి పాలనా ప్రాధాన్యతాంశంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంచుకుంది.
అందులో భాగంగా …. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందివ్వడం. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడం. పంట పెట్టుబడి సాయం చేయడం. పండిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఎన్ని కష్టాలొచ్చినా నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది.
అందుచేతనే పదేళ్లపాటు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎటువంటి బాధలు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీటిని అందించడానికి ఖర్చు అవుతుందని వెనకాడుతున్నది. ఇది సరికాదు.
ఎప్పుడైనా ప్రభుత్వాలే రైతుల దగ్గర భూమి శిస్తులు వసూలు చేసిన సందర్భాలున్నాయి కానీ ఉల్టా ప్రభుత్వమే రైతుకు భరోసా కల్పించే విధంగా పంట పెట్టుబడి అందించిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నదా..? రైతు సంక్షేమం దిశగా కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన ఫలితమే. ఈ పరిస్థితులను తెలంగాణ సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మనం ఇచ్చిన కరెంటు ఎటు పోయింది ? మనం ఇచ్చిన మిషన్ భగీరథ తాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? ఎండాకాలం లో కూడా మత్తడి దునికిన చెరువులు ఇప్పుడు ఎందుకు నీరు లేక ఎండిపోతున్నాయో.. ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు.
పల్లెల నుంచి హైదరాబాదు వంటి పట్టణాలకు బతకడానికి వచ్చిన పేదలకు నాటి మన ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ల ఇండ్లను కూల్చివేస్తున్నది. గోరేటి వెంకన్న లాంటి కవులు రాసిన, గల్లి చిన్నది గరీబోళ్ల కథ పెద్దది వంటి పాటల స్ఫూర్తితో, పేదలకు ఇండ్ల నిర్మాణం చేపట్టినం.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను హైడ్రా
పేరుతో కూల్చేస్తుంటే ….కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రావే… రావే…అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కానీ నన్ను వోడగొట్టి ఇంట్ల కూర్చోబెట్టిండ్రు కదా.. నేను ఎక్కడికి రావాలె? కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అయితది ? అన్నారు.
” కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లపాటు ప్రశాంతంగా బతికినాము అని తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇప్పుడు తిరిగి మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనయి. తెలంగాణకు ఎప్పుడు ఇగ ఇదే లొల్లా..? ప్రశాంతంగా బతుకొద్దా
..?తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి. ..పాదయాత్రలు కాదు మన మనసుతో యాత్రలు చేయాలి బుర్రతో ఆలోచనలు చేయాలి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను పాడు చేసుకునే ఆలోచనలు కాకుండా మన భవిష్యత్తు తరాలను మరింతగా బాగు చేసుకునే దిశగా ఆలోచన చేయాలి అన్నారు.
తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు… తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచీ నేటి దాకా పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను కేసీఆర్ సమావేశంలో వివరించారు. నెహ్రూ సహా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నుంచి నేటిదాకా కాంగ్రెస్ తెలంగాణకు జరిగిన ద్రోహలను కెసిఆర్ వివరించారు. తెలంగాణను ఆంధ్రలో కలపడం నుంచి, 19 69 లో వందలాదిమంది బిడ్డలను పొట్టన పెట్టుకోవడం నుంచి, నీళ్లు నిధులు , నియామకాలు విషయంలో తెలంగాణకు దశాబ్దాల కాలంగా జరిగిన అన్యాయాలను కేసీఆర్ వివరించారు అన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మొదటినుంచీ కనీస స్థాయిలో ప్రతిఘటించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేసిందనే ఆవేదన, వాళ్ళ తెలివి తక్కువ తనం చూసి, ఉద్యమ కాలంలో నేను వాళ్ళను దద్దమ్మలు సన్నాసులు అని తెలంగాణ సమాజం తరఫున అన్నాను తప్ప, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుంది..?
తెలంగాణ సంపద మీద అందరు గుంటనక్కలు మాదిరి కన్నేసి ఉన్నరు. ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా చేస్తలేరట, మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట, తెలంగాణలో వచ్చే సారి ఎన్డీఏ కూటమి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి… అంటే తెలంగాణను తెలియజేయాలని చూసే వాళ్ల పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణను ఆగం చేయడానికి కొందరు రెడీగా ఉంటారు. వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తెలంగాణను ఆగం చేసి కుట్రలను పసిగట్టి కాపాడుకోవాలి. ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖపడాల్సి వస్తది.
ఎనిమిది మంది బిజెపి ఎంపీలను, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే… ఏకానా కూడా పని కాలేదు.
తెలంగాణ నుంచి మన బి ఆర్ ఎస్ ప్రతినిధులను పార్లమెంటుకు పంపిస్తే…కొట్లాడి మన హక్కులు కాపాడుకుందుము కదా.
మన దగ్గర ఎంపీల బలం ఉంటే, కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, తో సహా పాద పాదయాత్రలో పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు తోపాటు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు.