ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే మరోవైపు టీఆర్ఎస్లో శాసనమండలి పదవుల ఆశావహుల సందడి మొదలైంది. త్వరలో ఖాళీ కాబోయే 16 ఎమ్మెల్సీ స్ధానాల్లో తమ పేరును కన్ఫామ్ చేసుకునేందుకు ఆశావాహులు పావులు కదుపుతున్నారు.
పార్టీలో మొదటి నుంచి పని చేస్తూ ఎలాంటి పదవులు దక్కనివారు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రాని వారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం సామాజిక సమీకరణల ఆధారంగా ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలుగా అవకాశం రాని వారికి చైర్మన్ పదవులు ఇచ్చేలా కసరత్తు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఈసారి ఎంపిగా పోటీచేసేందుకు ఆసక్తిచూపిస్తుండటంతో ఆయన స్ధానంలో గ్రూప్–1 అధికారుల సంఘం నేత మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ,కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ ఈ స్థానంలో టిక్కెట్ ఆశిస్తున్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి ,పూల రవీందర్ తిరిగి సీటు ఆశీస్తుండగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్రావుకు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు వరంగల్ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిత్వం కోసం తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది.
రంగారెడ్డి స్థానిక సంస్థల కోటా స్థానం కోసం మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, క్యామ మల్లేశ్ పోటీ పడుతున్నారు. నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి,ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీకి మరోసారి బెర్త్ కన్ఫామ్ అయినట్లే. దీంతో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం,టి.సంతోష్కుమార్లకు సైతం మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సీఎం కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ శేరీ సుభాష్ రెడ్డి పేరు కన్ఫామ్ కాగా టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.మొత్తంగా ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణ,ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు పెద్ద ఎత్తున నామినెటేడ్ పోస్టులను భర్తీచేయనుండటంతో గులాబీ నేతలు తమ గాడ్ఫాదర్ల ద్వారా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.