CM KCR:వైద్యచరిత్రలో సువర్ణ అధ్యాయం

20
- Advertisement -

వైద్యచరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ నుండి వర్చువల్‌గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు సీఎం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. గ‌తంలో ఐదు మెడిక‌ల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి 8 కాలేజీలు నూత‌నంగా ప్రాంరంభం కాబోతున్నాయని వెల్లడించారు.

2014లో 2850 మెడిక‌ల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం నుండి ప్రైవేటు, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ద్వారా సంవ‌త్స‌రానికి 10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్నాం అని వెల్లడించారు. క‌రోనా టైంలో ఆక్సిజ‌న్ చాలా అవ‌స‌రం ఉండే. దాన్ని గుణ‌పాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.

వ‌రంగ‌ల్‌లో అద్భుత‌మైన హాస్పిట‌ల్ నిర్మాణం జ‌రుగుతోందన్నారు. హైద‌రాబాద్‌కు న‌లువైపులా టిమ్స్ నిర్మిస్తున్నాం అని..గ‌చ్చిబౌలి, ఎల్‌బీ న‌గ‌ర్, అల్వాల్, ఎర్ర‌గ‌డ్డలో 1000 ప‌డ‌క‌ల చొప్పున హాస్పిట‌ల్స్ నిర్మిస్తున్నాం అని వెల్లడించారు. నిమ్స్‌ను మ‌రో 2 వేల ప‌డ‌క‌ల‌తో విస్త‌రిస్తున్నాం అని తెలిపిన సీఎం…వైద్యారోగ్య శాఖ‌ను అభినందించారు.

Also Read:Harishrao:వైద్యరంగ చరిత్రలోనే తొలిసారి

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని… విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించాం అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. గంజి కేంద్రాల‌తో విల‌సిల్లిన‌ ఉన్న పాల‌మూరు జిల్లాలో ఇప్పుడు వ్య‌వ‌సాయం ప‌రుగులు పెట్టిందన్నారు. ఒక దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. ఎక్క‌డైతే వైద్యారోగ్య వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుందో.. అక్క‌డ త‌క్కువ మ‌ర‌ణాలు, న‌ష్టాలు సంభ‌విస్తాయని కేసీఆర్ తెలిపారు. దేశంలో ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు.

- Advertisement -