సీఎం కేసీఆర్‌పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు..

185
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌ను చాలా బలమైన నేతగా అభివర్ణించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. మత రాజకీయాలను పులుముతున్న బీజేపీని ఎదుర్కోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే సమర్థవంతుడైన నాయకుడని ఒవైసీ తెలిపారు. జీహెచ్ఎంసీ ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కొన్ని స్థానాల్లో ఓటమి పాలైనంత మాత్రాన రాజకీయంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేసీఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి చూస్తూనే ఉన్నానని అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడు అని ఒవైసీ కొనియాడారు.

బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు పర్యటించిన డివిజన్లలో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేసిన ఒవైసీ, పాతబస్తీలో లక్షిత దాడులు చేస్తామన్న బీజేపీని ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించామని అన్నారు. ఇదే సమయంలో మేయర్ పదవికి మద్దుతుపైనా అసదుద్దీన్ స్పందించారు. తాము చాలా తక్కువ సీట్లలోనే పోటీ చేశామని, అయినా తమ సీట్లను నిలుపుకున్నామని అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ విషయంలో టీఆర్ఎస్ అధినేతలతో మాట్లాడుతానని.. తదుపరి రాజకీయ నిర్ణయాలపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని అన్నారు. కాగా, 51 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎం 44 చోట్ల విజయకేతనం ఎగురువేసిన విషయం తెలిసిందే. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ 55 స్థానాలు, బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎక్కేదెవరు అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

- Advertisement -