వ్యవసాయ విద్యుత్‌కు ఢోకా లేదు…

242
Online News Portal
KCR Held meeting
- Advertisement -

దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దాదాపు ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రైతులు వ్యవసాయ విద్యుత్ కనెకన్ల కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారని, కనెకన్లు ఇచ్చే క్రమంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. రైతుల ఎదురు చూపులకు స్వస్తి పలికేందుకు, కనెక్షన్ల మంజూరులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. వచ్చే ఏడు నెలల్లో అందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ముగించాలని కూడా సిఎం ఆదేశించారు.

క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జెన్ కో & ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 97 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు ఐదేళ్ల నుంచి ఇవి పేరుకుపోతున్నాయని, అందరికీ కనెకన్లు ఇవ్వాలంటే దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా కనెకన్లు ఇవ్వక పోవడం వల్ల ఎవరు డబ్బులిస్తే వారికే కనెకన్లు ఇచ్చే దందా నడుస్తున్నదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరక్కుండా, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందితేనే ఈ అక్రమాలకు తెరపడతుందని సిఎం అన్నారు. అందుకే దరఖాస్తు చేసిన రైతులందరికీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

unnamed

పెండింగ్ లో ఉన్న 97 వేల దరఖాస్తులతో పాటు రాబోయే నెలల్లో వచ్చే 20-30 వేల దరఖాస్తులను కూడా పరిగణలోకి కనెక్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సిఎం చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో కనెకన్లు ఇవ్వడానికి అవసరమైన పరికరాలు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికి, లైన్లు వేయడానికి, ఇతరత్రా పనులకు సమయం పడుతుంది కాబట్టి ఏడు నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి దరఖాస్తు దారులందరికీ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. ఎవరికి ఎప్పుడు కనెక్షన్ వస్తుందో తెలియని అనిశ్చితి తొలగించడానికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

ఏ మండలంలో ఎప్పుడు కనెకన్లు ఇస్తారో షెడ్యూల్ రూపొందించాలని, ఆ వివరాలను బహిర్గతం చేయాలని, గ్రామ పంచాయితీ నోటీసు బోర్డుపై పెట్టాలని సిఎం చెప్పారు. రైతులకు కూడా ఎప్పుడు కనెక్షన్ ఇచ్చేదీ తెలుపుతూ లేఖలు రాయాలని ఆదేశించారు. షెడ్యూల్ రూపొందించిన తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సిఎం అన్నారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదని, కావాల్సిన వైర్లు, పోళ్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర సామాగ్రికి ఆర్డర్ ఇవ్వాలని సిఎం ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులతో సహా ఏ వర్గం కూడా కరెంటుతో ఇబ్బందులు పడవద్దని సిఎం అన్నారు. ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు లేకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రబీ సీజన్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పదివేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ తట్టుకునేలా రూ.2,450 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ పార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే బోర్ల ఉపయోగం తగ్గుతుందని, ప్రాజెక్టుల లిఫ్ట్‌లకు విద్యుత్ అవసరం పెరుగుతుందని సిఎం అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో వెంటనే మరో ట్రాన్స్ పార్మర్ పెట్టాలని సిఎం చెప్పారు. తెలంగాణలో 5,46,000 వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయని, దీనికి 4శాతం మేర ట్రాన్స్ ఫార్మర్లు రోలింగ్ స్టాక్ పెడుతున్నామని వెల్లడించారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సిఎం కోరారు.

- Advertisement -