బార్లలో తాగుదామంటే రేట్లెక్కువ.. వైన్స్ పక్కన ఎప్పుడూ రద్ది. ఇంట్లో తాగడానికి ఒప్పుకోరు. ఇక విద్యార్థులకు వైన్స్ లో మందు అమ్మరు. అలాంటి వాళ్లు తాగడానికి ఏం చేస్తారు. ఎవరితోనైనా తెప్పించుకుని ఊరి శివార్లకో… చెరువు గట్లు, కాల్వ ఒడ్డు మీద కూర్చొని పుళ్లుగా తాగుతుంటారు.. ఇప్పుడు ఇది కరీంనగర్ శివారు ప్రాంతాల్లో ఇక నడవదు… దర్జాగా డ్యాం పక్కన కూర్చొని తాగితే అడ్డంగా బుక్కయిపోతారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్గా ఏర్పడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో రాజధానితో పోటీ పడుతున్నది. కమిషనరేట్ పరిధిలో 10వేల సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కోసం సాగుతున్న పోలీస్శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దాని పేరే డ్రోన్. గగన తలంలో విహారిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో చూపిస్తుంది. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి ఏపని చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. కరీంనగర్ లో డ్రోన్ కెమెరాలు ప్రవేశపెట్టి మందు బాబుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన మానేరుడ్యామ్, ఉజ్వల పార్క్, ఢీర్ పార్క్ పరిసర ప్రాంతాలలో మహిళలు ఊపిరి పీల్చుకునేలా, ఉల్లాసంగా గడిపేలా చర్యలు చేపడుతున్నారు.
కొందరు నేరగాళ్లు మానేరు తీరాన్ని టార్గెట్గా చేసుకుని అక్కడికి వచ్చే ప్రేమికులను, కొత్త జంటలను బెదిరించి దోచుకునేవారు. నగలు, నగదుతోపాటు మహిళలపై అత్యాచాలకు పాల్పడేవారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని చాలా మంది పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్లని పరిస్థితి.
దీంతో అల్లరి మూకలు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఇంతకాలం చెలరేగిపోయారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు లేక్ పోలీసింగ్ను డ్యాం వద్ద ప్రారంభించారు. నేరాల నియంత్రణకు రాష్ట్రంలోనే తొలిసారిగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. శివారు ప్రాంతాల్లో అసాంఘీక, అక్రమ కార్యకలాపాల నియంత్రణ కోసం వినియోగిస్తున్న డ్రోన్ కెమెరాలు సత్పలితాలనిస్తున్నాయి.
తాజాగా మానేరుడ్యాం శివారు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 10మంది మందుబాబులను అరెస్టు చేశారు. డ్రోన్ కెమెరాలు సాయంతో రెండు రోజుల్లోనే 50 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. మానేరు డ్యాం వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో జిల్లా వాసుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు పోలీసులు.