నందమూరి హరికృష్ణ మరణం ఆయన కుటుంబ సభ్యులకి, మిత్రులకి, సన్నిహితులకి, మాత్రమే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమూరి అభిమానులకి తీరని లోటుని మిగిల్చింది. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి చేర్చిన కుటుంబసభ్యులు శోక సముద్రం లో మునిగిపోతుండగా, ఆయన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి సినీ రంగ, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు అసంఖ్యాకంగా నందమూరి అభిమానులు ఆయన ఇంటికి తరలివెళ్తున్నారు. అయితే ఊహించని ఆయన మరణానికి ముందు ఇచ్చిన ఓ మాట మాత్రం అలాగే ఉండిపోయింది.
నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్ లతో కలిసి ఒక సినిమా చేస్తాననే మాట నిలబెట్టుకోకుండానే ఆయన స్వర్గస్థులయ్యారు. ముందు నందమూరి కళ్యాణ్ రామ్ కు జూనియర్ ఎన్.టి.ఆర్ తో, హరికృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలనే కోరిక కలిగి, దాన్ని జూనియర్ ఎన్.టి.ఆర్ ముందు పెట్టగా, ఎన్.టి.ఆర్ వెంటనే ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి హరికృష్ణను అడిగారు. సరే చేద్దాం అని మాటిచ్చిన ఆయన అందుకు తగ్గ కథను సిద్ధం చేసుకోమన్నారట. కానీ కథ ఇంకా పూర్తిగా సిద్ధం కాకముందే ఆయన అందర్నీ వదిలి వెళ్లిపోయారు. తన కొడుకులిద్దరికి ఇచ్చిన మాట పూర్తి చేయకుండానే ఆయన కాలం చాలించడం ఆ పుత్రులకి తీరని లోటుని మిగిల్చిందనే చెప్పాలి.