జియో ఉచితమే.. రూ.4500 పెట్టాల్సిందే !

184
JioPhone is not free, Rs 4500 must be spent on Jio plans
JioPhone is not free, Rs 4500 must be spent on Jio plans
- Advertisement -

జియో ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు జియో తమ నిబంధనలతో భారీగానే షాకిచ్చింది. కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్‌ నిబంధనలు, మాండేటరీ రీచార్జ్‌ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్‌ రిటర్న్ విధానాన్ని కంపెనీ వెబ్‌సైట్‌ లో పేర్కొంది. అదేంటీ జియోఫోన్‌ ఉచితం కదా.. రూ.1500 సెక్యూరిటీ బాండ్‌ మాత్రం కట్టాలి కదా. అది కూడా మూడేళ్ల తర్వాత తిరిగిచ్చేస్తారు కదా.. ఇక ఖర్చేముంది అనుకుంటున్నారా? అయితే జియోఫోన్‌ పనిచేయాలంటే రూ.4500 ఖర్చు చేయాల్సిందే. ఏడాదికి రూ.1500 చొప్పున రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందట.

ఫోన్‌ కోసం 60లక్షల మంది బుకింగ్‌ చేసుకోగా, ఈ నెల 21 నుంచి డెలివరీలను ప్రారంభించారు. రిలయన్స్‌ జియో సర్వసభ్య సమావేశం సంధర్బంగా జియో ఫోన్‌ ఉచితంగానే ఇస్తామని ముకేష్ అంబానీ ప్రకటించారు. అయితే సెక్యూరిటీ బాండ్‌ కింద రూ. 1500 మాత్రం చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వాపస్‌ చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. తాజాగా జియోఫోన్‌ పనిచేయాలంటే ఏడాదికి రూ.1500 రీఛార్జ్‌ చేసుకోవాలని జియో వెబ్‌సైట్లో పేర్కొన్నారు. జియో ఫోన్‌ యాక్టివేట్‌ అయినప్పటి నుండి ఏటా రూ.1500 చొప్పున మూడేళ్ల పాటు రిఛార్జ్‌ చేసుకోవాలని నియమనిబంధనల్లో స్పష్టం చేశారు.

ఒకవేళ ఇలా రీచార్జ్ చేసుకోకపోతే ఫోన్‌ను వాపస్‌ తీసుకునే హక్కు కంపెనీకి ఉంటుందని పేర్కోంది. తొలి ఏడాదిలోనే ఫోన్‌ను తిరిగిస్తే.. కంపెనీ ఎటువంటి రీఫండ్‌ చేయదు. పైగా వినియోగదారుడే రూ.1500లతోపాటు జీఎస్‌టీ, ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 12-24 నెలల మధ్య ఫోన్‌ను వాపస్‌ చేస్తే రూ.1000, జీఎస్‌టీ ఇతర పన్నులు కలిపి చెల్లించాలి. 24-36 నెలల మధ్య వాపస్‌ చేస్తే రూ.500లతో పాటు జీఎస్‌టీ ఇతర పన్నులు చెల్లించాలి. మూడేళ్ల పాటు సంవత్సరానికి ఖచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్‌ కచ్చితంగా చేసుకోవాలి. అప్పుడు కూడా షరతులతో కూడిన అమౌంట్ మీకు వస్తుంది. అయితే అలా మూడేళ్ల కన్నా ముందే ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే కూడా వినియోగదారులకు నష్టమే.

- Advertisement -